పవన్కు చెర్రీ పోటీ: మెగా విభేదాలపై ఫ్యాన్స్తో డిబేట్!
హైదరాబాద్: మెగా కుటుంబంలో రాజకీయ చిచ్చు కొనసాగుతోంది! జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖలో భారీ సభను ఏర్పాటు చేసిన రోజే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ తేజ హైదరాబాదులో అభిమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. పవన్ కొత్త పార్టీ నేపథ్యంలో ఈ సమావేశంలో రామ్ చరణ్ తేజ అభిమానుల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారని తెలుస్తోంది.
ఈ సమావేశంలో చెర్రీ... మెగా కుటుంబ సభ్యుల రాజకీయ విభేదాల పైన ఓపెన్గా మాట్లాడనున్నారని అంటున్నారు. అభిమానులకు అన్ని విషయాలను వివరిస్తారట. అలాగే వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటారని చెబుతున్నారు. కాగా, ఎక్కువ మంది మెగా అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెర్రీ సమావేశానికి ఎంత మంది వస్తారు, ఏఏ ప్రాంతాల నుండి వస్తారు.. అనే ఉత్కంఠ నెలకొంది.
పలువురు మెగా అభిమానులు బాహాటంగా తాము పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటిస్తామని చెప్పారు. సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేదని అభిమానులు భావిస్తున్నారు. సినిమాల పరంగా తాము చిరంజీవిని ఆయన కుటుంబ సభ్యులను అభిమానిస్తామని, రాజకీయాలకు వస్తే మాత్రం తాము పవన్ వెంట నడుస్తామని చెబుతున్నారు.
మరోవైపు, పోటీ సభ అనే అంశానని కొందరు అభిమానులు మాత్రం ఖండిస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు, ప్రతి సంవత్సరం అభిమానులు ఈ రోజు రామ్ చరణ్ను కలిసి విషెస్ చెప్పడం, రక్తదానం చేయడం ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ వైజాగ్ సభను ఉద్దేశించి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం లేదని అంటున్నారు.
కాగా, గురువారం పవన్ కళ్యాణ్ సభ నేపథ్యంలో విశాఖపట్నంలో అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీశారు. ఇక.. రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు వేడుకలు బంజారాహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అభిమానుల సమక్షంలో నిర్వహిస్తారు. అనంతరం ఫిల్మ్ కల్చరల్ క్లబ్లో అభిమానులతో సమావేశం ఉండనుందని సమాచారం.