రామ్ చరణ్ మధ్యవర్తిత్వం: పవన్ కళ్యాణ్ జనసేనలోకి చిరంజీవి?
హైదరాబాద్: ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ప్రస్తుత కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్తో చేతులు కలుపుతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. జనసేన పార్టీలోకి చిరంజీవి వచ్చే అవకాశం ఉందనేది ఆ ఊహాగానాల సారాంశం. బాబాయ్, డాడీ చేతులు కలిపేందుకు సినీ హీరో రామ్ చరణ్ తేజ మధ్యవర్తిత్వం నెరిపినట్లు చెబుతున్నారు.
ఇద్దరినీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు రామ్ చరణ్ తేజ చేస్తున్న కృషికి అల్లు అర్జున్ కూడా సహకరిస్తున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి జనసేన పార్టీలోకి రావడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. తన 150 సినిమా నిర్మాణం పూర్తి కాగానే జనసేనలోకి వచ్చి రాజకీయాలను పూర్తి స్థాయిలో నడిపే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు చెబుతున్నారు.
చిరంజీవి 150వ సినిమాను నిర్మిస్తున్న రామ్ చరణ్ తేజా బాబాయ్ పవన్ కళ్యాణ్ నిర్మించే సినిమాలో నటించబోతున్నారు. 2018నాటికి మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే గొడుగు కిందికి వచ్చి మల్టీ స్టారర్ చేసే అలోచనలో ఉన్నట్లు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించారు. యంత్రాంగం, మందీమార్బలం లేకుండా ఆయన తెలుగుదేశం, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చి, ప్రచారం సాగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా మారిందనే విషయం అందరికీ తెలిసిందే.
పార్టీని స్థాపించినప్పటికీ పూర్తి స్థాయి నిర్మాణం చేయడంలో, కార్యకలాపాలను నిర్వహించడంలో పవన్ కళ్యాణ్ సమయం వెచ్చించలేకపోతున్నారు. వివిధ విషయాలపై అప్పుడప్పుడు ప్రతిస్పందిస్తున్నారు. ట్విట్టర్ను వాహికగా చేసుకుని ఆయన మాట్లాడుతున్నారు.
సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్కు రాజకీయాలపై సమయం వెచ్చించే వెసులుబాటు లేదు. దాంతో చిరంజీవిని రంగంలోకి దించే ఆలోచనలో మెగా ఫ్యామిలీ ఉన్నట్లు చెబుతున్నారు. అన్నయ్యను ముఖ్యమంత్రిగా చూడడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం కూడా అంటారు. అందువల్ల దానికి చిరంజీవిని మెగా ఫ్యామిలీ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.