బతికిపోయామని చంద్రబాబుపై చెవిరెడ్డి సెటైర్: పాయింట్ లాగిన బుచ్చయ్య చౌదరి
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నియంతృత్వ పోకడలకు పోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన గుంటూరులో సీఐడీ ఆఫీసు వద్ద మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకి రాష్ట్ర ప్రజల వాస్తవ పరిస్థితి అర్థం కావడం లేదని అన్నారు.
ఎంతసేపూ సింగపూర్, మలేషియా, జపాన్ దేశాల్లా ఏపీని మార్చేస్తానని చెబుతుంటారని, అదెలా సాధ్యమని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఏపీ ప్రజల అదృష్టంకొద్దీ చంద్రబాబు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, సోమాలియా దేశాల్లో పర్యటించలేదని, ఒకవేళ ఆయన ఆ దేశాల్లో పర్యటించి ఉంటే ఆ దేశాల్లా ఏపీని మార్చేస్తానని చెప్పేవారని ఆయన ఎద్దేవా చేశారు.
ఎప్పుడూ సింగపూర్లా చేస్తా అని సీఎం చెప్పడం వెనుక కారణం, అక్కడ గత 40 ఏళ్లుగా ప్రతిపక్షం అన్నదే లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో అది సాధ్యం కాదని చంద్రబాబు గుర్తించాలని ఆయన సూచించారు. నిరంకుశత్వం, నియంతృత్వ పోకడలతో ప్రతిపక్షాన్ని అణచివేస్తామంటే కుదరదని ఆయన అన్నారు.
కాపు కాని భూమనకు కాపు గర్జనతో సంబంధం ఏంటీ: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
కాపు కాని భూమనకు కాపు గర్జనతో సంబంధమేంటని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూటి ప్రశ్న వేశారు. తుని విధ్వంసం కేసులో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 'తుని రైలు దగ్ధం ఘటనలో జగన్, విజయ సాయి రెడ్డిలే ప్రధాన సూత్రదారులని' ఆయన అన్నారు. తుని ఘటనలో దోషులకు శిక్ష పడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
ఏబీకే ప్రసాద్, రోజా కోర్టు కేసులకు కోట్లాది డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏపీకి హోదా సాధన విషయంలో ఉండవల్లి పుస్తకం చూసైనా రఘువీరా రెడ్డికి బుద్ధి రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో వైసీపీ నాయకుల తీరు తమిళనాడులో అయితే జైల్లో పెట్టేవారని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో వక్ర భాష్యం చెప్పి గోదావరి వాసుల్ని రెచ్చగొట్టింది ప్రతిపక్షనేత జగనే అంటూ బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.