మా వెంటపడి అరెస్ట్ చేసి.. నాని, ఉమలపై ఎందుకిలా?: బాబును ఏకేసిన చెవిరెడ్డి
రవాణా శాఖ అధికారిపై దాడికి పాల్పడిని టీడీపీ పార్లమెంటుసభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులపై కేసులు నమోదు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాం
అమరావతి: రవాణా శాఖ అధికారిపై దాడికి పాల్పడిని టీడీపీ పార్లమెంటుసభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులపై కేసులు నమోదు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం నల్లరంగు దుస్తులు ధరించిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా శాఖ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన కేశినేని నాని, బొండా ఉమాలపై కేసులు నమోదు చేయాలన్నారు. సీఎం పక్షపాత వైఖరి నిరసిస్తూ బహిరంగ లేఖ రాశారు. తిరుపతి విమానాశ్రయంలో తాను, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైయస్సార్ పార్టీ కాళహస్తి ఇంచార్జీ బియ్యపు మధుసూదన్ రెడ్డిపై అసత్యపు కేసు పెట్టి 21రోజులపాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారని చెప్పారు.
నెల్లూరు జైల్లో ఉండగానే మరో కేసులు పెట్టి రాజమండ్రి, పీలేరు జైలుకు తరలించారని గుర్తు చేశారు. 'మీ పార్టీ నేతలు తమ అనుచరులతో కలిసి ఐజీ స్థాయి అధికారిని దుర్భాషలాడి, దాడి చేస్తే ఎందుకు కేసులు పెట్టలేదు' అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. మధ్యవర్తిత్వం పేరుతో నాటకాలాడి కేసులు లేకుండా చేశారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందినవాళ్లయితే కేసులు ఉండవా? అని చెవిరెడ్డి ప్రశ్నించారు.
టీడీపీ నేతలు ఎన్ని అరాచకాలు పెట్టినా కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. చట్టం, న్యాయం అందరికీ ఒకేలా ఉండవా? అని చెవిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో తాలిబన్ల పాలన నడుస్తోందని ఆరోపించారు.
ఏ తప్పూ చేయని తమను వెంటాడి, వేధించి సెంట్రల్ జైలుకు పంపిన చంద్రబాబు.. ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికిపోయిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. అధికారిపై దాడి చేసిన ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బొండా ఉమాలను వెంటనే అరెస్ట్ చేయాలని, అప్పటి వరకు దీక్ష కొనసాగిస్తానని చెవిరెడ్డి తేల్చి చెప్పారు.