నారావారిపల్లెకు నేనే ఎమ్మెల్యే, బాబూ! మగాళ్లు లేరా: చెవిరెడ్డి ఘాటుగా..
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెకు తాను ఎమ్మెల్యేనని వ్యాఖ్యానించారు. కృష్ణా నది పైన తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నిరసనగా జగన్ దీక్ష చేస్తున్నారు.
ఈ దీక్షా ప్రాంగణంలో చెవిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు కూడా రాయలసీమకు చెందిన వ్యక్తేనని చెప్పారు. అంతేకాక తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే చంద్రబాబు జన్మించారన్నారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరికి తాను ఎమ్మెల్యేనని ఆయన చెప్పుకొచ్చారు.
అంటే, చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెకు తానే ఎమ్మెల్యేనన్నారు. చంద్రబాబును నమ్మని చంద్రగిరివాసులు జగనన్నపై విశ్వాసముంచి తనను ఎమ్మెల్యేగా గెలిపించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై చెవిరెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు.
ఆపరేషన్ ఆకర్ష్ పైన ఘాటు విమర్శ
ఆపరేషన్ ఆకర్ష్ పైన చెవిరెడ్డి నిప్పులు చెరిగారు. ఆకర్ష్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తం పాలనను పక్కనపెట్టిన చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకునే పనిలోనే నిమగ్నమయ్యారని ఆరోపించారు. జగన్ గెలిపించిన వారి పట్ల అంతగా ఆసక్తి కనబరచడానికి కారణమేంటని చెవిరెడ్డి ప్రశ్నించారు.
జగన్ గెలిపించిన ఎమ్మెల్యేలను చెవిరెడ్డి మగాళ్లుగా అభివర్ణించారు. జగన్ గెలిపించిన ఎమ్మెల్యేల వైపు చూస్తున్న చంద్రబాబుకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. 'మీ పార్టీలో మగాళ్లు లేరా? మీ ఎమ్మెల్యేలంతా ఆడంగులా? కాదు కాదు, ఆడంగులంటే మహిళలు ఆగ్రహిస్తారు. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఆడా, మగా కాని మాడాలా?' అని ధ్వజమెత్తారు.
జగన్ దీక్ష పైన కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం
జగన్ జల దీక్ష పైన ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. జగన్ దీక్ష లింగడు వచ్చి పాయే అన్న సామెతలా ఉందన్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు అబద్దాలు చెబుతున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకొని తీరుతామన్నారు.