రామోజీరావుకు చెవిరెడ్డి నోటీసు, మోడీకి చెప్పా: బాబు
చిత్తూరు/విజయవాడ: తన పరువుకు భంగం కలిగించేలా అసత్య అరోపణలు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్కు, తన వివరణ తీసుకోకుండానే దురుద్దేశంతో ఆ ఆరోపణలను ప్రచురించారని ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మంగళవారం లీగల్ నోటీసులు పంపించారు.
తన పరువుకు భంగం కలిగించేలా ప్రభాకర్ మాట్లాడితే, కనీసం తన వివరణ తీసుకోకుండానే ఆ వ్యాఖ్యలను ఈనాడులో ప్రచురించారని నోటీసులో పేర్కొన్నారు. నోటీసు అందిన 15 రోజుల్లోపు నష్టపరిహారంగా రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
చెవిరెడ్డి తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డికి పింఛన్ వస్తుందని, ఆ పింఛను ఎవరు తీసుకుంటున్నారో చెప్పాలని చెవిరెడ్డి తండ్రికి పింఛను ఇవ్వాలా, దీని పైన జగన్ సమాధానం చెప్పాలని పత్రికా సమావేశంలో పరకాల ప్రభాకర్ ఇటీవల సవాల్ చేశారు. దీనిపై చెవిరెడ్డి నోటీసు పంపించారు.
చెవిరెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి దరఖాస్తు చేయకున్నా అర్హుల జాబితాలోకి ఆయన పేరు ఎలా వచ్చిందో చెప్పాలంటూ అదికారులను చెవిరెడ్డి రాతపూర్వకంగా కోరారు. అధికారుల పొరపాటు వల్లే పింఛను జాబితాలోకి మీ తండ్రి పేరు చేరిందని, అందులో మీ ప్రమేయం లేదని, ఏ రోజు పింఛను డబ్బు తీసుకోలేదని అధికారులు చెవిరెడ్డికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
తెరాస తగవుపై మోడీతో మాట్లాడా: చంద్రబాబు
చీటికీ మాటికీ తగవులకు వస్తోన్న తెరాస ప్రభుత్వ వైఖరిపై తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడానని కృష్ణా జిల్లా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అందరం తెలుగువాళ్లం ఇద్దరి మధ్య గొడవలు వద్దని చెప్పానని, అభివృద్ధిలో పోటీపడదామన్నానని, సమస్యలు వచ్చినప్పుడు చర్చలతో పరిష్కరించుకుందామని చెప్పానని, కానీ తెరాస ప్రతి విషయానికీ అనవసరమైన గొడవ చేస్తోందని, ఇందువల్ల సమస్యలు తనకే కాకుండా అందరికీ వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మోడీతో తాను మాట్లాడానన్నారు. త్వరలోనే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని మోడీ హామీ ఇచ్చారన్నారు.