Amma Vodi: రేపే అమ్మఒడి: చిత్తూరుకు వైఎస్ జగన్: ఏర్పాట్లను పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం..!
చిత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏటా 15 వేల రూపాయల నగదు మొత్తాన్ని ప్రోత్సాహకరంగా అందించడానికి ఉద్దేశించిన పథకం ఇది. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా పాలనా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఉదయం చిత్తూరుకు చేరుకున్నారు. అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేసిన గ్రీమ్స్ పేట సంజీవ్ గాంధీ నగర్ లోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల మైదానాన్ని ఆయన పరిశీలించారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ ఈ సందర్భంగా మంత్రి వెంట ఉన్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత వైఎస్ జగన్ చిత్తూరుకు రానుండటం ఇదే తొలిసారి. బహిరంగ సభకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. సుమారు 25 వేలమందికి పైగా మహిళలు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెబుతున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ అనంతరం వైఎస్ జగన్ కొన్ని స్టాళ్లను ప్రారంభిస్తారు.
తమ పిల్లలను పాఠశాలకు పంపించే ప్రతి పేద కుటుంబానికి ఏటా 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని అమలు చేయడానికి వార్షిక బడ్జెట్ లో 6,455 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లుల పేరు మీద వారి అకౌంట్ లో ఈ మొత్తాన్ని జమ చేస్తుంది ప్రభుత్వం.