రేపే వైఎస్ విగ్రహం పున: ప్రతిష్ఠ: టీడీపీ నేతలకు ఆహ్వానం..దానికి కారణం?
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు విగ్రహం పున: ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం విజయవాడలో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ లో ఇదివరకు ఉన్న ప్రదేశంలోనే ఈ విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించడానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్ దశమ వర్ధంతిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని పున: ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ, లోక్ సభ సభ్యులను ఆహ్వానించడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం.. ప్రొటోకాల్.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం వైసీపీ పోరుబాట: మద్దతు ప్రకటించిన కాంగ్రెస్!
సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ విగ్రహాన్ని పున: ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, కొడాలి నాని హాజరు కానున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రొటోకాల్ ను అనుసరించి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, సుజనా చౌదరి, శాసన మండలి సభ్యుడు బుద్ధా వెంకన్నలను ఆహ్వానించారు. విగ్రహావిష్కరణ అనంతరం వైఎస్ జగన్.. ఇడుపుల పాయకు బయలుదేరి వెళ్తారు.
తొలగించిన చోటే..
ఇదివరకు ఉన్న వైఎస్ విగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందనే కారణాన్ని సాకుగా చూపించి, ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించినట్లు అప్పట్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా- ప్రభుత్వం మారిన నేపథ్యంలో.. వైఎస్ విగ్రహాన్ని అదే స్థానంలో పునఃప్రతిష్ఠించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నమూనాతో ఇదివరకు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పోలీస్ కంట్రోల రూమ్ జంక్షన్ వద్ద 12 అడుగుల ఎత్తు ఉన్న వైఎస్ విగ్రహాన్ని నెలకొల్పగా..కృష్ణా పుష్కరాల కోసం విజయవాడకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తుల వాహనాల రాకపోకలు అడ్డంకిగా ఉంటుందనే ఉద్దేశంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహావిష్కరణ
అదే రోజు కడప జిల్లా పులివెందులలో వైఎస్ జగన్.. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. నిజానికి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కిందటి నెల 8వ తేదీన నిర్వహించాల్సి ఉండగా.. అది వాయిదా పడిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్.. ఢిల్లీ పర్యటనలో ఉన్నందున. అప్పట్లో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఇడుపుల పాయలో వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శిస్తారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించన అనంతరం వైఎస్ వివేకా ఘాట్ ను సందర్శిస్తారు. అనంతరం వైఎస్ జగన్.. వివేకా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.