చంద్రగిరి రీపోలింగ్: హస్తినలో చంద్రబాబు రచ్చ: జాతీయ స్థాయి ఉద్యమం!
అమరావతి: రీపోలింగ్ అంశాన్ని జాతీయ సమస్యగా చిత్రీకరించారు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ విషయంపై దేశ రాజధానిలో రచ్చ రచ్చ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్షాల మద్దతును కూడగడుతున్నారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులను వెంటబెట్టుకుని కాస్సేపట్లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో భేటీ కానున్నారు. అనంతరం- కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి చంద్రబాబు నాయుడు కసరత్తు ఆరంభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అయిదు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా ఆ పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు, సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురం పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం తుది దశలో భాగంగా- పోలింగ్ నిర్వహించబోతున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం
రీపోలింగ్పై తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఉద్దేశపూరకంగానే కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చిందని ఆ పార్టీ నాయకులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో- ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే- ఆ పార్టీకి చెందిన సీనియర్లు కంభంపాటి రామ్మోహన్ రావు, సీఎం రమేష్.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన 34 రోజుల తరువాత రీపోలింగ్కు ఆదేశించడాన్ని తప్పు పట్టారు.
తాజాగా
ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా ప్రస్తావించబోతున్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో భేటీ ముగిసిన అనంతరం ఆయన నేరుగా జంతర్ మంతర్ చేరుకుని ధర్నా చేస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారాన్ని
కేంద్ర ఎన్నికల కమిషన్తో తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష యుద్ధాన్ని కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారాన్ని అడ్డుగా పెట్టుకుని చంద్రబాబు ఎన్నికల కమిషన్తో తలపడుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయగా.. చంద్రబాబు సహా 21 ప్రతిపక్షాల నాయకులకు చుక్కెదురైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గిన చంద్రబాబు తాజాగా- రీపోలింగ్ అంశాన్ని ఎత్తుకున్నారు. విపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల సంఘం వైఖరిపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని భావిస్తున్నారు.
నిరసన వ్యక్తం చేస్తోన్న విషయాన్ని చంద్రబాబు
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రోడ్షో సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతలో హింసాత్మక పరిస్థితులు తలెత్తిన అనంతరం- ఒకరోజు పాటు ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ రెండు అంశాల పట్ల తాము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోన్న విషయాన్ని చంద్రబాబు, ఇతర ప్రతిపక్ష నేతలు లిఖితపూరకంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు తెలియజేస్తారని అంటున్నారు.