YS Jagan: ఢిల్లీకి వైఎస్ జగన్: హడావుడిగా అపాయింట్ మెంట్..రెండు రోజులు అక్కడే
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. ఈ సాయంత్రం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉంటారని తెలుస్తోంది. తన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయెల్, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం.
స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన నేపథ్యంలో..
వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఈ నెల 26వ తేదీన ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జీవో కూడా విడుదలైంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల సున్నపురాళ్ల పల్లి-పెద్ద దండ్లూరు గ్రామాల మధ్య ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి ముడి ఇనుము లింకేజీని కల్పించాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికోసం ఆయన ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు, రైల్వే కనెక్టివిటీ కోసం పీయూష్ గోయెల్ ను కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అమ్మఒడి పథకం ప్రారంభానికి ఆహ్వానం..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మంగా భావిస్తోన్న నవరత్నాల్లో ఒకటి- అమ్మఒడి పథకం. ఈ పథకాన్ని వచ్చే నెల 9వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ పథకం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని వైఎస్ జగన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదివరకు ఓ పథకం ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించినప్పటికీ.. ఆయన గైర్హాజర్ అయ్యారు. అమ్మఒడి పథకం ప్రాధాన్యతను మోడీకి వివరించి.. రాష్ట్రానికి రప్పించేలా చూడాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రెండు రోజులు అక్కడే..
రెండు రోజులుగా ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రయత్నించిందని చెబుతున్నారు. శుక్ర, శనివారాల్లో అపాయింట్ మెంట్ లభించడంతో జగన్ హడావుడిగా హస్తినకు బయలుదేరి వెళ్లారని అంటున్నారు. ఈ రెండు రోజుల్లో షెడ్యూల్ ప్రకారం.. నిర్దేశిత మంత్రులందరినీ కలుస్తారని, శనివారం సాయంత్రం రాష్ట్రానికి తిరిగి వస్తారని తెలుస్తోంది. అప్పటిదాకా జగన్ కు సంబంధించిన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.