దుబాయ్ విమానాశ్రయంలో వైఎస్ జగన్.. పక్కనే పార్టీ ఎంపీలు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. వారంరోజుల అమెరికా వ్యక్తిగత పర్యటన కోసం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత దుబాయ్ విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి మరో విమానంలో అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (రాజంపేట), మార్గాని భరత్ (రాజమండ్రి) ఆయన వెంట ఉన్నారు. శనివారం డల్లాస్ లోని హచీసన్ కన్వెన్షన్ సెంటర్ లో వైఎస్ జగన్ నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొంటారు.
ప్రవాసాంధ్రులతో ముఖాముఖి చర్చలను నిర్వహిస్తారు. తన అమెరికా పర్యటన సందర్భంగా వైఎస్ జగన్.. అమెరికా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వారికి వివరించనున్నారు. ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులతో విస్తృత చర్చల్లో పాల్గొంటారు.
వైఎస్ జగన్ రాకను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున స్వాగత బ్యానర్లు, హోర్డింగులను కట్టారు. 22వ తేదీన చికాగోలో పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. వైఎస్ జగన్ చిన్నకుమార్తె వర్షా రెడ్డికి అమెరికా ఇండియానా స్టేట్ లోని ప్రతిష్ఠాత్మక నోట్రెడామ్ యూనివర్శిటీలో సీటు లభించింది. ఈ నెల 20వ తేదీన ఆమె ఆ యూనివర్శిటీలో అడ్మిషన్ తీసుకోనున్నారు.