ఓటు వేసిన వైఎస్ జగన్: మాస్కు లేకుండా: కోవిడ్ నిబంధనల ఉల్లంఘన అంటోన్న టీడీపీ
అమరావతి: రాజ్యసభ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం 10 గంటల సమయంలో ఆయన అసెంబ్లీ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 9:30 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయ నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ 9:50 నిమిషాలకు అసెంబ్లీకి చేరుకున్నారు. కొంతమంది మంత్రులతో తన ఛాంబర్లో సమావేశం అయ్యారు. 10 గంటల సమయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాజ్యసభ ఎన్నికల తర్వాత జగన్ కేబినెట్ విస్తరణ- నాలుగైదు మార్పులు- డిప్యూటీగా కన్నబాబు..?
మాస్క్ ధరించకపోవడం పట్ల
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాస్క్ ధరించలేదు. దీనిపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు మాస్క్ ధరించకపోవడం సమంజసం కాదని అంటున్నారు. దీన్ని కోవిడ్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఆరంభమైన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత.. టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారని తెలుస్తోంది.
ఏకగ్రీవానికి అవకాశం ఉన్నా..
రాష్ట్రం నుంచి రాజ్యసభకు నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నాలుగు స్థానాలను కూడా అధికార వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకోవడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అయిదో అభ్యర్థిని బరిలో నిలపడం వల్ల పోలింగ్ను నిర్వహించడం అనివార్యమైంది. టీడీపీ తరఫున అయిదో అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యురో సభ్యుడు వర్ల రామయ్య పోటీలో ఉన్నారు. ఆయన గెలవడానికి అవకాశాలు ఎంత మాత్రమూ లేవు. బలం లేకపోయినప్పటికీ.. అయిదో అభ్యర్థిని నిలబెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహం వేరేగా ఉందని అంటున్నారు.
దళిత కార్డును ప్రయోగించేలా
దళిత నాయకుడైన వర్ల రామయ్యను చంద్రబాబు వ్యూహాత్మకంగా రాజ్యసభ ఎన్నికల బరిలో దింపారని అంటున్నారు. ఆయనకు ఎలాగూ ఓటమి తప్పదని తెలిసినప్పటికీ.. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. దళిత కార్డును ప్రయోగించడమేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఒక దళిత నాయకుడిని రాజ్యసభకు పంపించడానికి వైసీపీ సహకరించలేదనే కారణాన్ని చూపాలనేది చంద్రబాబు వ్యూహం అని అంటున్నారు. వైఎస్ఆర్సీపీని దళిత వ్యతిరేక పార్టీగా ముద్ర వేయడానికి రాజ్యసభ ఎన్నికలను వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
Recommended Video
పోటీలో ఉన్నది వీరే..
రాజ్యసభ ఎన్నికల బరిలో మొత్తం అయిదు మంది అభ్యర్థులు నిల్చున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు, తెలుగుదేశం తరఫున ఒకరు పోటీ చేస్తున్నారు. వైసీపీ సీనియర్ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్యా రామిరెడ్డిలతో పాటు పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వాని అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున ఆ పార్టీ పొలిట్ బ్యురో సభ్యుడు వర్ల రామయ్య తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పరిమళ్ నత్వానీకి రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలంటూ స్వయంగా ముఖేష్ అంబానీ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.