చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ ఎక్కడ ఆపారో..జగన్ అక్కడి నుంచే: జనంలోకి జగన్: ముహూర్తం ఫిక్స్!

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన రచ్చబండ.. మళ్లీ తెరమీదికి వచ్చింది. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి ఉద్దేశించిన ఈ రచ్చబండ కార్యక్రమం.. ఆరంభానికి ముందే ఆగిపోయిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరిన వైఎస్ గమ్యస్థానానికి చేరుకోలేకపోయారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో వైఎస్ కన్నుమూశారు. దీనితో రచ్చబండ ఆగిపోయింది.

పున:ప్రారంభించబోతున్న వైఎస్ జగన్

పున:ప్రారంభించబోతున్న వైఎస్ జగన్

రచ్చబండ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పున: ప్రారంభించబోతున్నారు. తన తండ్రి చేపట్టిన కార్యక్రమాన్ని ఆయన కుమారుడు ఓ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించబోతున్నారు. వైఎస్ కన్నుమూసిన రోజునే దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలోనే ఆరంభించనున్నారు వైఎస్ జగన్. ప్రభుత్వ పథకాల అమలు తీరు, గ్రామ వలంటీర్ల వ్యవస్థ విధానం, గ్రామ వలంటీర్ల విధి విధానాలతో పాటు ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి నుంచి వైఎస్ జగన్ అభిప్రాయాలను సేకరించనున్నారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం ఆయన అన్ని జిల్లాల్లోనూ పర్యటనలు చేపట్టబోతున్నారు.

మళ్లీ జనంలోకి..

మళ్లీ జనంలోకి..

అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలు వైఎస్ జగన్ సచివాలయానికే పరిమితమైన విషయం తెలిసిందే. అన్ని శాఖలు, విభాగాధిపతులతో సమీక్షా సమావేశాలతో తీరిక లేకుండా గడిపారు. సమీక్షా సమావేశాల ద్వారా ఆయా శాఖలపై అవగాహనను పెంచుకునే పనిలో పడ్డారు. కాగా- సెప్టెంబర్ 2 నుంచి జనంలో మమేకం కావాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర పేరుతో వైఎస్ జగన్ 3648 కిలోమీటర్ల మేర నడిచారు. కడప జిల్లాలోని ఇడుపుల పాయలో ఆరంభమైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగిసింది. 14 నెలల పాటు వైఎస్ జగన్ ప్రజల్లోనే గడిపారు. అధికారంలోకి వచ్చిన మూడునెలల పాటు ప్రజలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ లోటునున పూడ్చుకోవడానికా అన్నట్లు వైఎస్ జగన్.. సెప్టెంబర్ నెల మొత్తం ప్రజల్లో గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

13 జిల్లాల్లో విస్తృతస్థాయి పర్యటన

13 జిల్లాల్లో విస్తృతస్థాయి పర్యటన

రచ్చబండ కార్యక్రమంతో వైఎస్ జగన్ ప్రజల్లో మమేకం కానున్నారు. వచ్చేనెల 2వ తేదీ నుంచి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. 13 జిల్లాల్లో పర్యటించడానికి అవసరమైన షెడ్యూల్ ను ఖరారు చేసే పనిలో పడ్డారు అధికారులు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకూ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. తన పరిపాలన విధి విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, గ్రామ వలంటీర్ల పనితీరు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించడంతో పాటు..పాలనా విధానాలను మెరుగుపర్చుకోవడానికి అవసరమైన సూచనలు, సలహాలను సైతం స్వీకరించడానికి వైఎస్ జగన్ సన్నద్ధంగా ఉన్నారని చెబుతున్నాయి అధికార వర్గాలు.

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy is all set to began Rachchabanda program in the State. It will be kick start in the Chittoor District on September 2nd. In this connection, YS Jagan once again planning to tour all over the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X