గ్రామ సచివాలయాలు నేటి నుంచే..పైలాన్ సిద్ధం: సొంత స్థలాన్ని కేటాయించిన వైఎస్ జగన్ ట్రస్టు
కాకినాడ: రాష్ట్రంలో నూతన శకం ఆవిష్కారం కాబోతోంది. బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాక్షాత్కరించబోతోంది. ఎక్కడో రాజధానిలో ఉండే సచివాలయం మన ఊరిలోనే ఏర్పాటు కాబోతోంది. ఇప్పటిదాకా- ఓ సర్టిఫికెట్ కావాలంటే వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. గ్రామ సచివాలయాల ద్వారా ఆ ఇబ్బందికి బ్రేక్ పడబోతోంది. ఒకే చోట అన్ని రకాల 200లకు పైగా ప్రభుత్వ సేవలను పొందే వీలును కల్పిస్తూ గ్రామ సచివాలయాల వ్యవస్థను రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికగా భావిస్తోన్న ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.
సీఎం జగన్ చలించిపోయారు: ఆ చిన్నారులను చూడగానే ఇలా : 15 లక్షల మంజూరు..!
తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్..
వైఎస్ జగన్ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయలుదేరి కాకినాడకు చేరుకుంటారు. కాకినాడ సమీపంలోని కరపలో నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, పైలాన్ ను ఆయన ఆవిష్కరిస్తారు. అక్కడే.. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బహిరంగ సభ ముగిసిన తరువాత వైఎస్ జగన్ రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు. కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతి కుమార్ వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి తాడేపల్లికి చేరుకుంటారు.
11 వేలకు పైగా గ్రామ సచివాలయాలు..
రాష్ట్రవ్యాప్తంగా 11 వేలకు పైగా గ్రామాల్లో సచివాలయాలు ఒకేసారి ప్రారంభం కాబోతున్నాయి. రెండు వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా సచివాలయాల్లో కార్యకలాపాలను నిర్వహించడానికి ఏకకాలంలో 1,26,578 మందిని ఎంపిక చేసింది ప్రభుత్వం. రాత పరీక్షల ద్వారా వారిని ఎంపిక చేసింది. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి నియామక పత్రాలను కూడా అందజేశారు. ఒక సచివాలయం 12 నుంచి 15 మంది వరకు ఉద్యోగులను నియమించారు.
గ్రామ సచివాలయానికి సొంత స్థలం..
తన సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులలో గ్రామ సచివాలయం నిర్మాణానికి వైఎస్ జగన్ తన సొంత స్థలాన్ని ఇచ్చారు. పులివెందుల నియోజకవర్గం పరిధిలోని లింగాల మండలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రస్టు పేరు మీద కొంత స్థలాన్ని కేటాయించారు. అదే స్థలంలో సచివాలయాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించనున్నారు. కడప జిల్లాలో ఏర్పాటైన సచివాలయాలను ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, స్థానిక ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభిస్తారు.