అమెరికాలో వైఎస్ జగన్ మేనియా: ముఖ్యమంత్రి పేరు మీద వెలిసిన హోర్డింగులు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనియా అమెరికాలోని డల్లాస్, డెట్రాయిట్ నగరాలను అలముకుంది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఆయన అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఇదివరకు ఆయన జెరూసలేం వెళ్లొచ్చినప్పటికీ.. అది ఆయన వ్యక్తిగత పర్యటన. ఈ సారి అధికారికంగా ఆయన అమెరికా వెళ్లబోతున్నారు. ఈ నెల 17వ తేదీన డల్లాస్ లో ఆయన ప్రవాసాంధ్రులతో సమావేశం కానున్నారు. ముఖాముఖి చర్యల్లో పాల్గొంటారు. డల్లాస్ లోని కే బెయిలీ హచీసన్ డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. దీనికోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా అమెరికాకు వెళ్లనున్న నేపథ్యంలో.. ప్రవాసాంధ్రులు- ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై సెల్ విభాగం నాయకులు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలను చేపట్టారు. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం వైఎస్ జగన్ అమెరికాకు బయలుదేరి వెళ్తారు.
వారం రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ నెల 23వ తేదీన ఆయన మళ్లీ రాష్ట్రానికిక చేరుకుంటారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆయా సంఘాలు, సంస్థలతో పాటు అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా (టీసీఎన్ఏ) ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.
ప్రవాసాంధ్రుల కోరిక మేరకు వైఎస్ జగన్ ఈ నెల 17న డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి సంబంధించిన హోర్డింగులు, బ్యానర్లు డల్లాస్ లో వెలిశాయి. నాటా ప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటయ్యే ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానపత్రాలను అందజేస్తున్నారు.
ఈ కార్యక్రమం ఇప్పటికే పతాకస్థాయికి చేరుకుందని నాటా ప్రతినిధులు చెబుతున్నారు. వైఎస్ జగన్ రాకకోసం తాము ఎదురు చూస్తున్నామని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ అధ్యక్ష పదవి కోసం రేసులో నిల్చున్న సమయంలో ఇదే కన్వెన్షన్ సెంటర్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారని, ఆ తరువాత ఓ రాజకీయ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి అని అంటున్నారు.