వైఎస్ జగన్: నాడు సీఎం కుమారుడిగా.. నేడు ముఖ్యమంత్రిగా..! కుటుంబ సెంటిమెంట్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపిన బాటలో పయనిస్తున్నారు. తనకు స్ఫూర్తి తన తండ్రేనని పలుమార్లు స్పష్టం చేసిన వైఎస్ జగన్.. ఆయన తరహాలోనే పరిపాలన సాగిస్తున్నారనే గుర్తింపును పొందారు. తాజాగా- ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జెరూసలేం వెళ్తారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. జెరూసలేంను సందర్శించడం వైఎస్ కుటుంబానికి సెంటిమెంట్. ముఖ్యమంత్రిగా తన విదేశీ పర్యటనలను జెరూసలేం నుంచే శ్రీకారం చుట్టడం ల శుభసూచకంగా భావిస్తున్నారు వైఎస్ జగన్. తన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిళ, ఆమె భర్త అనిల్ తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ జెరూసలేం వెళ్తారు.
కేంద్ర అభ్యంతాలపై నేరుగా ప్రధానితోనే: ఆగస్టు 6న ఢిల్లీకి సీఎం జగన్: వెంకయ్య నాయుడుతోనూ..!
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి హోదాలో జెరూసలేంను సందర్శించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జెరూసలేంకు వెళ్లొచ్చిన జగన్.. ఈ సారి ముఖ్యమంత్రి హోదాలో ఆ దేశ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం. సొంత ఖర్చులతో వైఎస్ జగన్ జెరూసలేం వెళ్లనున్నారు.
ప్రొటోకాల్ ప్రకారం.. జగన్ వెంట వ్యక్తిగత సిబ్బందితో పాటు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ సెంథిల్ కుమార్, సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి జోషి వెళ్లనున్నారు. జెరూసలేంలోని క్రైస్తవ పవిత్ర స్థలాలతో పాటు క్రీస్తు జన్మస్థలం బెత్లహాంను సందర్శిస్తారు. అనంతరం ఈ నెల 4వ తేదీన స్వదేశానికి తిరిగి వస్తారు. అనంతరం 5, 6, 7 తేదీల్లో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. ఉప ప్రధాని ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారు.