నవరత్నాలతో వైఎస్ జగన్ ఛాంబర్ అలంకరణ: ఒక్కో చిత్రపటం వెనుక ఒక్కో కథ..!
అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో.. సుమారు రెండు నెలలుగా బోసిపోయి కనిపించిన సచివాలయం కొత్త కళను సంతరించుకుంది. కొత్త ప్రభుత్వం రాకతో కళకళలాడుతోంది. కోలాహలంగా మారింది. రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మితమైన తాత్కాలిక సచివాలయ భవనంలో శనివారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టారు. తన ఛాంబర్లో కాలిడారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు.
ఓ వైపు తండ్రి చిత్రపటం..మరోవైపు బాధ్యతను గుర్తు చేసే నవరత్నాలు
వైఎస్ జగన్ ఛాంబర్లో అడుగు పెట్టిన వెంటనే- ఓ వైపున దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు చిత్రపటం కనిపిస్తుంది. చేతులు రెండు వెనక్కి పెట్టుకుని, చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ ఉండే చిత్రపటాన్ని ఛాంబర్లో అమర్చారు. మరోవైపున.. ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నవరత్నాల చిత్రపటాలను గోడలకు తగిలించారు. అమ్మఒడి, ఫీజు రీఎంబర్స్మెంట్, వైఎస్ఆర్ రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యనిషేధం, ఆసరా, పేదలందరికీ ఇళ్లు, పింఛన్ల పెంపు పథకాలతో కూడిన చిత్రపటాల అతికించారు.
అనుక్షణం దగ్గరగా ఉండేలా..
ప్రతి పేద వాడి ఇంట్లో నాన్న ఫొటో పక్కన తన ఫొటో ఉండాలి.. అనే ఏకైక లక్ష్యంతో తాను స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలనను అందిస్తానని వైఎస్ జగన్ ఇదివరకే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రకటిస్తూ వచ్చారు. దాన్ని నిజం చేసేలా, వైఎస్ జగన్ ఆశయాలను ప్రతిబింబించేలా, ఆయన ఆలోచనలకు రూపం ఇచ్చేలా ఛాంబర్ను తీర్చిదిద్దారు. రాష్ట్ర ప్రజలు తన మీద ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికప్పుడు జ్ఞప్తికి తెచ్చే ఉద్దేశంతోనే నవరత్నాలతో కూడిన చిత్రపటాలను ఛాంబర్లో అమర్చినట్లు చెబుతున్నారు.
తండ్రి లక్ష్యాన్ని అందుకోవడానికి..
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో అసంతపూర్తిగా మిగిలి పోయిన సంక్షేమ పథకాలు, నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను తాను పూర్తి చేయాలని వైఎస్ జగన్ ప్రధాన లక్ష్యం. దాన్ని అనుక్షణం చిరునవ్వుతో గుర్తుకు తెచ్చేలా వైఎస్ నిలువెత్తు చిత్రపటాన్ని ఛాంబర్లో అమర్చారు. తన తండ్రి తలచుకున్న ప్రతీసారి తనలో నూతనోత్తేజం కలుగుతుందని వైఎస్ జగన్ పలు సందర్భాల్లో చెప్పుకొన్నారు. ఆయన నుంచి అనుక్షణం స్ఫూర్తిని పొందేలా ఈ ఏర్పాటు చేశారు.
నవరత్నాలు పొదిగిన ఛాంబర్
తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించే ప్రతి తల్లికీ ఏటా 15 వేల రూపాయలను అందించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఆ పిల్లలు ఎంత వరకు చదివితే.. అంతవరకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఇంటికి దూరంగా, ఇతర ప్రాంతాల్లో ఉంటూ చదువుకునే పేద, మధ్య తరగతి పిల్లల హాస్టల్ ఖర్చుల నిమిత్తం ఏటా 20,000 రూపాయలను అమ్మ ఒడి పథకం కింద ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పింఛన్ పెంపు, రైతు భరోసా..ఇవన్నీ!
వృద్ధాప్య పింఛన్ వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించడంతో పాటు అర్హులకు దశలవారీగా 3000 రూపాయల పింఛన్ ఇవ్వడానికి మరో నవరత్నాన్ని ప్రకటించారు. వికలాంగులకు 3,000 పింఛను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే వైఎస్సార్ చేయూత కింద నెలకు 2,000 అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా పేరుతో ఏటా మే నెలలో 12,500 రూపాయలు ఇస్తారు. దశలవారీగా 12,500 రూపాయల చొప్పున మొత్తం 50,000 రూపాయలను చెల్లిస్తారు. వైద్యం ఖర్చు కింద వెయ్యి రూపాయలు దాటి పోయే ఏ వ్యాధికైనా ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకుని వస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడైనా సరే నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయడానికి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు.