ప్రపంచకప్ క్రికెట్ స్టేడియంలో వైఎస్ జగన్ అభిమానుల సందడి!
బర్మింగ్హామ్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ప్రపంచకప్ టోర్నమెంట్లో సందడి చేశారు. వైఎస్ జగన్ ఫొటోను ముద్రించిన బ్యానర్తో కోలాహలం చేశారు. ప్రపంచకప్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మంగళవారం ఇంగ్లండ్ బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ దృశ్యం కనిపించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ గెలుపుతో టీమిండియా ప్రపంచకప్ సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది.
Recommended Video
ఇంగ్లండ్లో ప్రవాసాంధ్రుల సంఖ్య ఎక్కువే
ఇంగ్లండ్లో ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. విద్య, ఉపాధి అవకాశాల కోసం లండన్కు వెళ్లి, అక్కడే స్థిరపడిన ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. లండన్, బర్మింగ్హామ్, లీడ్స్, మాంచెస్టర్, చెస్టర్-లీ-స్ట్రీట్, యార్క్షైర్ వంటి నగరాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఒక్క లండన్లోనే సుమారు లక్షమందికి పైగా ప్రవాసాంధ్రులు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. వైఎస్ జగన్ పెద్ద కుమార్తె వర్షా రెడ్డి ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు. ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆమె చదువుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మార్చి 11వ తేదీన పోలింగ్ ముగిసిన తరువాత వైఎస్ జగన్.. లండన్కు వెళ్లిన విషయం తెలిసిందే.
వైఎస్ జగన్ అభిమానుల సందడి కొత్తేమీ కాదు..
వైఎస్ఆర్ సీపీ అభిమానులు ఇలా సందడి చేయడం కొత్తేమీ కాదు. ఇదివరకు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా వైఎస్ జగన్ అభిమానులు మ్యాచ్ల సందర్భంగా బ్యానర్లు, ఫొటోలను ప్రదర్శించారు. ఆయన ఎప్పుడు లండన్కు వెళ్లినా పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హీత్రూ విమానాశ్రయంలో కనిపిస్తుంటారు. వైఎస్ జగన్ను సాదరంగా ఆహ్వానిస్తుంటారు. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఎడ్జ్బాస్టన్ లో కూడా అలాంటి సన్నివేశమే కనిపించింది. టీమిండియా జెర్సీలు ధరించి, త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ, వైఎస్ జగన్ ఫొటోను ముద్రించిన బ్యానర్ను ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
సెమీ ఫైనల్లో దర్జాగా..
ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో బంగ్లాదేశ్ను ఓడించడంతో టీమిండియాకు సెమీఫైనల్ ఎంట్రీ లభించింది. దర్జాగా సెమీస్లో అడుగు పెట్టింది. టీమిండియా ఈ టోర్నమెంట్లో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ 5వ తేదీన శ్రీలంకను ఢీ కొట్టబోతోంది భారత క్రికెట్ జట్టు. భారత జట్టుకు ఈ టోర్నమెంట్లో అదే చివరి లీగ్ మ్యాచ్. బంగ్లాదేశ్ జట్టును 28 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. మరోసారి సెంచరీతో చెలరేగిపోయాడు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ. 92 బంతుల్లో 104 పరుగులు చేశాడు. జట్టు భారీ స్కోరు సాధించడానికి బాటలు వేశాడు. ఈ సెంచరీలో అయిదు సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. సౌమ్యా సర్కార్ బౌలింగ్లో లిట్టన్ కుమార్ దాస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్.