పంద్రాగస్టు సంరంభం: విజయవాడలో వైఎస్ జగన్: జిల్లాల్లో జెండాలను ఎగురవేసేది వీరే..
విజయవాడ: రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంరంభం ఆరంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా, వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విజయవాడతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు ఆరంభించింది జిల్లా పాలనా యంత్రాంగం. విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించబోతోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రులు, జిల్లాల్లో మంత్రులు.. జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. దీనికి సంబంధించిన జాబితా ఖరారైంది.
జెరూసలేం టూర్ ఎఫెక్ట్: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. తీర ప్రాంతాల్లో ఉప్పునీటి శుద్ధి కేంద్రాలు?
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (శ్రీకాకుళం), ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణి (విజయనగరం), పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ (విశాఖపట్నం), ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని (తూర్పుగోదావరి), ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ (పశ్చిమగోదావరి) రవాణాశాఖ మంత్రి పేర్ని నాని (గుంటూరు), జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (ప్రకాశం), హోం శాఖ మంత్రి సుచరిత (నెల్లూరు), మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (కర్నూలు), ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా (కడప), గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (అనంతపురం), ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి (చిత్తూరు) ఆయా జిల్లాల్లో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
ప్లాస్టిక్ జెండాలను ఎగురవేయడాన్ని నిషేధించిన నేపథ్యంలో.. ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు అధికారులు. ప్లాస్టిక్ జెండాలను ఎగరవేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్తో రూపొందించిన జాతీయ జెండాలను ఉపయోగించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ప్లాస్టిక్ బదులు పేపర్ జెండాలు వాడాలని సూచించింది. ఫ్లాగ్ కోడ్ అమలు విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్లాస్టిక్ జెండాలను వినియోగించడం వల్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం.. వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని, ప్రజలు వాటిని తొక్కుతూనే తిరుగుతుంటారంటూ ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఇదివరకే కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించిన విషయం తెలిసిందే.