జగన్ భావోద్వేగం: మీ బిడ్డగా..పులివెందులపై వరాల సునామీ: మెడికల్ కాలేజీ..డాక్టర్ వైఎస్సార్ గా..!
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై వరాల సునామీని కురిపించారు. భారీ ప్రాజెక్టులను మంజూరు చేశారు. వాటి విలువ 1300 కోట్ల రూపాయలు. ప్రభుత్వ వైద్య కళాశాల, నైపుణ్యాభివృద్ధి సంస్థలను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. రోడ్ల విస్తరణ మొదలుకుని మురుగునీటి పారుదల వరకూ పులివెందుల ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించే నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రూ.370 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, రూ.100 కోట్లతో భూగర్భ మురుగునీటి పారుదల, రూ.17 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
Admin Capital:3నెలల్లో విశాఖకు: అంతర్జాతీయ డిజైన్లు వద్దే వద్దు: ఆంధ్రా వర్శిటీ, రుషికొండ ఐటీ పార్కు
క్రిస్మస్ వేడుకల్లో
వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం నాటితో ఆయన జిల్లా పర్యటన ముగియబోతోంది. ప్రస్తుతం ఆయన పులివెందులలో ఉన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలను పులివెందులలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఉదయం ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి క్రిస్మస్ పండగను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు.
పులివెందుల ప్రజలే కొండంత అండ..
అనంతరం స్థానిక మైదానంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దశాబ్దాల తరబడి పులివెందుల ప్రజలు తన కుటుంబం వెంట నడుస్తున్నారని, కష్టనష్టాలు ఎదురైన సమయంలో కూడా తామున్నామనే కొండంత ధైర్యాన్ని ఇచ్చారని చెప్పారు. పులివెందుల ప్రజల అండదండలు తనకు శ్రీరామరక్షగా మారాయని వైఎస్ జగన్ భావోద్వేగంతో ప్రసంగించారు.
మీ బిడ్డగా, మీ రుణాన్ని తీర్చుకుంటా..
`మీ బిడ్డగా నన్ను ఆదరించారు. మీ చల్లని దీవెనలతో ముఖ్యమంత్రిని అయ్యాను. పుట్టిన గడ్డ రుణాన్ని తీర్చుకుంటాను..` అని జగన్ అన్నారు. అందుకే- 1300 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అభివృద్ధి పనులను చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. పులివెందులకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలగా నామకరణం చేస్తున్నట్లు చెప్పారు. 370 కోట్ల రూపాయలతో ప్రభుత్వ కళాశాల నిర్మితమౌతుందని వైఎస్ జగన్ తెలిపారు.
జెఎన్టీయూలో స్కిల్ డెవలప్ మెంట్..
పులివెందులలోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెఎన్టీయు)లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పబోతున్నామని అన్నారు. ప్రొద్దుటూరు నుంచి పులివెందుల, కదిరి, గోరంట్ల మీదుగా అనంతపురం జిల్లాలోని కోడికొండ చెక్ పోస్ట్ వరకు రహదారి విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి వేముల, వేంపల్లి మండలాల్లోని చిట్టచివరి గ్రామం వరకూ నీటిని సరఫరా చేయడానికి అవసరమైన పనులను చేపట్టామని, దీనివల్ల 15 వేల ఎకరాలకు అదనంగా సాగునీరు లభిస్తుందని వైఎస్ జగన్ తెలిపారు.