విష వాయువు లీకేజీపై వైఎస్ జగన్ ఆరా: షట్డౌన్ ఆదేశాలు: ఎప్పటికప్పుడు నివేదిక: అవసరమైతే
విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ (జెఎన్పీసీ)లో కొనసాగుతోన్న సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటు చేసుకున్న విష వాయువుల లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆయన తన కార్యాలయం (సీఎంఓ) అధికారులతో మాట్లాడారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎంఓ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
Recommended Video
విశాఖలో మరోసారి విష వాయువు లీక్: ఇద్దరు మృతి: నలుగురికి గాయాలు: పలువురికి అస్వస్థత
ఎప్పటికప్పుడు అప్డేట్స్..
పరవాడ ఫార్మాసిటీలో నెలకొన్న పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదికను తెప్పించుకోవాలని ఆదేశించారు. మరణాల సంఖ్య పెరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన వివరాలను తనకు అందించాలని చెప్పారు. విష వాయువుల ప్రభావం వల్ల అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని, దీన్ని స్వయంగా పర్యవేక్షించేలా కలెక్టర్కు ఆదేశించాలని వైఎస్ జగన్ తన కార్యాలయం అధికారులకు సూచించారు.
వెంటిలేటర్పై ఒకరు..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పేషీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలోని రియాక్టర్ వద్ద బెంజిమోడైజల్ గ్యాస్ లీక్ అయినట్లు చెప్పారు. అదే సమయంలో అదే విభాగంలో ఉన్న షిఫ్ట్ ఇన్ఛార్జీలు గౌరీశంకర్, నరేంద్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు తెలిపారు. ఈ విష వాయువులను పీల్చి.. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. వారిలో ఒకరు వెంటిలేటర్పై ఉన్నారని, మిగిలిన ముగ్గురికి ప్రాణాపాయం తప్పినట్లు తెలిపారు.
కంపెనీ షట్డౌన్..
విష వాయువులు వెలువడిన వెంటనే ముందుజాగ్రత్త చర్యగా సాయినార్ లైఫ్ సైన్సెస్ సంస్థను షట్డౌన్ చేయించినట్లు కలెక్టర్ తెలిపారు. రాత్రి 11:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా తమ దృష్టికి వచ్చినట్లు వినయ్చంద్.. వెల్లడించారని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ ఉన్న విభాగానికి మాత్రమే పరిమితమైందని, ఫలితంగా ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవని చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారని తెలిపారు.
కాస్సేపట్లో అవంతి శ్రీనివాస్..
జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కాస్సేపట్లో పరవాడ ఫార్మా సిటీని సందర్శించబోతున్నారు. అనంతరం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సాయినార్ సంస్థ ఉద్యోగులను పరామర్శిస్తారని చెబుతున్నారు. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మంగళవారం తెల్లవారు జామున విష వాయువులు వెలువడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు మరణించారు. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యారు. సాయినార్ లైఫ్ సైన్సెస్లో వెలువడిన విష వాయువులను బెంజిమిడైజోల్గా గుర్తించారు. పరిశ్రమంలో పనిచేసే పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.