జగన్ టార్గెట్ ఉత్తరాంధ్ర: టీడీపీ కంచుకోట బద్దలు కొట్టే లక్ష్యం.. ఆ మహిళా నేతకు బంపర్ ఆఫర్?
అమరావతి: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఉత్తరాంధ్ర జిల్లాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నేశారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల తరహాలోనే తెలుగుదేశం పార్టీని ఉత్తరాంధ్రంలో కోలుకోలేని విధంగా దెబ్బతీయడానికి పావులు కదుపుతున్నారు. దీనికోసం రాజ్యసభ ఎన్నికలను ఆయన వేదికగా చేసుకోబోతున్నారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ఉత్తరాంధ్రకు చెందిన నాయకులకు అవకాశం కల్పించనునన్నట్లు తెలుస్తోంది. ఈ సమీకరణాల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి రాజ్యసభ ఛాన్స్ దక్కొచ్చని సమాచారం. ఆమెతో పాటు ముందు నుంచీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్న కుటుంబానికి చెందిన నాయకులకు రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని అంటున్నారు.
కొరుకుడు పడని లోక్ సభ..
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఎనిమిదింటిని గెలుచుకుంది వైఎస్ఆర్సీపీ. ఇచ్ఛాపురం, టెక్కలి స్థానాలను కోల్పోయింది. ఉన్న ఒక్క శ్రీకాకుళం లోక్ సభ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోట చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయారు. ఆయనపై తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. టెక్కలి స్థానం నుంచి బరిలో దిగిన పేరాడ తిలక్ పై మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెం నాయుడు గెలుపొందారు. శ్రీకాకుళం లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు సర్వశక్తులు ఒడ్డినప్పటికీ.. ఫలితం తేడా కొట్టింది.
ఆ ఇద్దరి ఓటమితో మళ్లీ వెలుగులోకి..
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా పని చేశారు. 2014 తరువాత పెద్దగా రాజకీయాల్లో కనిపించలేదు. మొన్నటి ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికలకు రెండునెలల ముందు పార్టీ మారారు. మొదట్లో ఆమెకు అసెంబ్లీ టికెట్ ఇస్తారనే ప్రచారం సాగింది. టెక్కలి అసెంబ్లీ లేదా శ్రీకాకుళం లోక సభ టికెట్ ను ఆశించినప్పటికీ.. పాత కాపులను కాదని కృపారాణికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయలేదు వైఎస్ జగన్. టెక్కలి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్, శ్రీకాకుళం లోక్ సభ నుంచి పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరూ ఓడిపోయారు. దీనితో మరోసారి కృపారాణి పేరు తాజాగా తెరమీదికి వచ్చింది.
కృపారాణిపై భగ్గు మంటోన్న క్యాడర్
అభ్యర్థుల విజయానికి కృషి చేయలేదనే విమర్శలు కృపారాణిపై ఉన్నాయి. పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ ల గెలుపు కోసం ఆమె ఎంత మాత్రమూ ప్రయత్నించలేదని, తనకు టికెట్ దక్కలేదనే అక్కసుతోనే ఆమె పార్టీ అభ్యర్థుల విజయానికి తనవంతు కృషి చేయలేదని అంటున్నారు వైఎస్ఆర్సీపీ జిల్లా స్థాయి నాయకులు. శ్రీకాకుళం ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న కృపారాణి.. ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా లేరని ఆమెపై భగ్గుమంటోన్న నాయకుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయినప్పటికీ- కాళింగుల సామాజిక వర్గానికి చెందిన బలమైన మహిళా నేత కావడం కలిసి వస్తోందని అంటున్నారు. పైగా కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నందున ఢిల్లీ స్థాయిలో ఆమెకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.
వైఎస్ఆర్సీపీ ఆకర్షణలో టీడీపీ కుటుంబం
పార్టీ ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటూ వస్తోన్న నాయకులపై కూడా వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటోన్న వారికి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ టికెట్ ఇవ్వొచ్చనే ప్రచారం సాగుతోంది.