వారం రోజుల్లో మరో పథకం: 7, 8 తేదీల్లో వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన: ఈ స్కీమ్ అక్కడే ప్రారంభం
కడప: రాష్ట్ర వైద్యరంగంలో చరిత్రలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ..అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 108, 104 అంబులెన్స్లకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా మరో పథకాన్ని ప్రారంభించబోతున్నారు. సరిగ్గా వారంరోజుల్లో ఈ పథకం అమలు కాబోతోంది. రాష్ట్రంలో నిరుపేదలకు సొంత ఇంటిని కల్పించడానికి ఉద్దేశించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన తన సొంత నియోజకవర్గం పులివెందులలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభం కానుంది.
Recommended Video
అందుబాటులో అధునాతన అంబులెన్సులు: ప్రారంభించిన జగన్: జిల్లాల సరిహద్దుల్లో స్వాగత ఏర్పాట్లు
దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీనికోసం వైఎస్ జగన్ ఈ నెల 7, 8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటనకు రానున్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రారంభించబోతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద నిర్మించిన ఆడిటోరియం, ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో 139 కోట్లతో నిర్మించిన ఏడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విభాగాలను ఆయన ప్రారంభిస్తారు. పులివెందుల నియోజకవర్గం పరిధిలో 255 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన జగనన్న కాలనీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. జిల్లావ్యాప్తంగా 754 ఎకరాల లేఅవుట్లను వైఎస్ జగన్ అదేరోజు ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఈ పథకం కింద ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారు. వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే రోజన మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలు, నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఇప్పటికే దీనికి అవసరమైన భూమిని ప్రభుత్వం సేకరించింది. అర్హులైన వారి జాబితాను రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అర్హత ఉండి పట్టాలు అందని వారికి మరో విడతలో అవకాశం ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది.
రెండు విడతల్లో జగనన్న కాలనీల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తిచేయనుంది. తొలి విడత నిర్మాణాన్ని వచ్చే నెల 28వ తేదీ ప్రారంభిస్తారు. 15 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తారు. వచ్చేఏడాది ఆగస్టు నాటికి తొలి విడత ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ వెంటే.. రెండోవిడతలో మరో 15 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్లను నిర్మించి ఇస్తారు. దీనికోసం ప్రభుత్వం బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల్లో ఇదీ ఒకటి. దీన్ని రెండేళ్లలో పూర్తి చేయబోతోంది.