15న న్యూఢిల్లీకి వైఎస్ జగన్: నీతి ఆయోగ్ భేటీకి హాజరు: 9న శ్రీవారి దర్శనానికి!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన దేశ రాజధానికి వెళ్లనున్నారు. న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో ఏర్పాటు కాబోయే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోతుండటం ఇదే తొలిసారి. అలాగే- కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నీతి ఆయోగ్ భేటీ కావడం కూడా ఇదే తొలిసారి అవుతుంది.
నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ను ఆయన ఈ సందర్భంగా ప్రధానంగా వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది. తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఎప్పుడు కలిసినా ప్రత్యేక హోదా కోసం విజ్ఞప్తి చేస్తూనే ఉంటానని వైఎస్ జగన్ ఇదివరకే ఢిల్లీ వేదికగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో- ఆయన మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్ ప్రస్తావించబోతున్నారు. నీతి ఆయోగ్ వేదికగా హోదా డిమాండ్ను లేవనెత్తడం ఇదే తొలిసారి అవుతుంది. నీతి ఆయోగ్ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్లు హాజరవుతారు. తమ రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన, కీలక అంశాల గురించి వారు ఈ సమావేశంలో ప్రస్తావించడం, నీతి ఆయోగ్ వేదికగా ప్రధాన మంత్రికి వివరించడం ఆనవాయితీ. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా ఈ భేటీలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదంటూ ఇదివరకు నీతి ఆయోగ్ ఛైర్మన్ అరవింద్ పనగరియా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలాంటి నీతి ఆయోగ్ సమావేశంలో వైఎస్ జగన్ తన వాదనను ఎలా వినిపిస్తారు? ఎలా ఒప్పించగలుగుతారు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. 22 మంది లోక్సభ సభ్యుల బలంతో దేశంలోనే మూడవ అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన డిమాండ్లను ఏ విధంగా నెరవేర్చుకుంటుందనేది చర్చనీయాంశమైంది.
9న తిరుపతికి వైఎస్ జగన్!
అంతకుముందు- ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లబోతున్నారు. శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు వంటి పాలనా పరమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. ఆ మరుసటి రోజే ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. మూడు నెలల కాలంలో మూడోసారి ఆయన శ్రీవారిని దర్శించుకున్నట్టవుతుంది. ఫిబ్రవరిలో తన పాదయాత్ర ముగించుకున్న వెంటనే వైఎస్ జగన్ ఇచ్ఛాపురం నుంచి రైలులో నేరుగా తిరుపతి చేరుకుని, కాలినడకన తిరుమలకు వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం- ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకరోజు ముందు ఆయన తిరుమలేశుడిని దర్శించుకున్నారు. తాజాగా మరోసారి ఏడుకొండలవాడి దర్శనం చేసుకోనున్నారు.