చంద్రబాబు సొంత జిల్లాలో ప్రతిష్ఠాత్మక పథకానికి శ్రీకారం: చిత్తూరుకు వైఎస్ జగన్.. !
చిత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన ప్రారంభించనున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏటా 15 వేల రూపాయల నగదు మొత్తాన్ని ప్రోత్సాహకరంగా అందించే ఈ పథకాన్ని ప్రారంభించడానికి వైఎస్ జగన్.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాను ఎంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరిచుకుంది.
YS Jagan: డైహార్డ్ ఫ్యాన్: డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి టిక్ టాక్ వీడియో: రాయలసీమ ముద్దుబిడ్డ అంటూ
వైఎస్ జగన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా పాలనా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. చిత్తూరు గ్రీమ్స్ పేట సంజీవ్ గాంధీ నగర్ లోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. సభా స్థలాన్ని కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ పరిశీలించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత వైఎస్ జగన్ చిత్తూరుకు రానుండటం ఇదే తొలిసారి. బహిరంగ సభకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. తమ పిల్లలను పాఠశాలకు పంపించే ప్రతి పేద కుటుంబానికి ఏటా 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా బడ్జెట్ లో నిధులను కూడా కేటాయించింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి వార్షిక బడ్జెట్ లో 6,455 వేల కోట్ల రూపాయలను కేటాయించింది.
రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లుల పేరు మీద వారి అకౌంట్ లో ఈ మొత్తాన్ని జమ చేస్తుంది ప్రభుత్వం. మొదట్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. అనంతరం దీన్ని విస్తరించింది. ప్రైవేటు పాఠశాలలను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చింది.