కేసీఆర్, వైఎస్ జగన్కు ప్రధాని పిలుపు: ఈ సాయంత్రమే: అఖిలపక్ష భేటీ.. చైనాపై రణనీతి
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని గాల్వన్ వ్యాలీ వద్ద సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల అనంతరం చైనాపై కఠిన వైఖరిని అనుసరించబోతోంది కేంద్ర ప్రభుత్వం. తాడోపేడో తేల్చుకోవడానికి సమాయాత్తమౌతోంది. చైనాను దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చైనాను ఎలా నియంత్రించాలనే అంశంపై శుక్రవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సాయంత్రం 5 గంటలకు ఈ అఖిల పక్ష సమావేశం ఆరంభం కాబోతోంది.
చైనాపై తాడో పేడో: ఎల్లుండి అఖిలపక్ష భేటీ: కమ్యూనిస్టులపై ఫోకస్: యుద్ధం చివరి అస్త్రంగా
వర్చువల్ విధానంలో..
నరేంద్ర మోడీ తన కార్యాలయం నుంచి దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.. వర్చువల్ పద్ధతిన ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సహా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులతో ప్రధానమంత్రి సంభాషిస్తారు. వారి అభిప్రాయాలను సేకరిస్తారు. మున్ముందు చైనాపై ఎలాంటి వైఖరిని అనుసరించాలనే అంశంపై వారితో మాట్లాడతారు.
కేసీఆర్, వైఎస్ జగన్లకు పిలుపు
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అఖిల పక్ష సమావేశంలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమతి అధ్యక్షుడి హోదాలో కేసీఆర్, దేశంలోనే నాలుగో అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు వారిద్దరికీ ఇప్పటికే పిలుపు అందింది.
ఇద్దరు సీఎంలకూ కేంద్రమంత్రుల ఫోన్
అఖిల పక్ష సమావేశంలో పాల్గొనాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇద్దరూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఈ మేరకు వారిద్దరికీ గురువారం సాయంత్రమే ఫోన్ చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనే విషయాన్ని, అజెండాను వివరించారు. ఒక్కో ముఖ్యమంత్రితో సుమారు 12 నిమిషాల పాటు సంభాషించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ దేశ రాజకీయాల్లో తటస్థ వైఖరిని అనుసరిస్తున్నాయి. అటు ఎన్డీఏ కూటమిలో గానీ, ఇటు యూపీఏలో గానీ ఈ రెండు పార్టీలు భాగస్వామ్యులు కాదు.
23 ప్రధాన ప్రతిపక్షాలతోనూ..
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలను పక్కన పెడితే.. 23 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలన్నింటితోనూ ప్రధాని వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశాలు లేకపోలేదు. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలతో పాటు కాంగ్రెస్, సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీ, శివసేన, డీఎంకే, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రతిపక్షాల అధినేతలతో ప్రధానమంత్రి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఈ భేటీలో తేలిన అభిప్రాయాల మేరకు
ఈ అఖిల పక్ష భేటీలో వెల్లడైన అభిప్రాయాల మేరకు కేంద్రప్రభుత్వం చైనాపై అనుసరించాల్సిన విధానాలపై ఓ నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఇప్పటికే చైనాతో ట్రేడ్వార్ను ఆరంభించింది కేంద్రం. 50 వరకు చైనా యాప్లను తొలగించాల్సి ఉంటుందంటూ ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. అదే సమయంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), రైల్వే అనుబంధ సంస్థ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ చైనా కంపెనీలకు కటీఫ్ చెప్పాయి. ఈ పరిస్థితుల్లో ఇదే వైఖరిని కొనసాగించాల్సి ఉంటుందా? లేక ప్రత్యక్ష యుద్ధానికి దిగాల్సి ఉంటుందా? అనేది కేంద్రం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది.