ముఖ్యమంత్రులుగా ఉండీ వారసులను గెలిపించుకోలేకపోయారు!
అమరావతి: ఈ సారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అనేక చిత్ర, విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఆసక్తికర అంశాలు తెరమీదికి వచ్చాయి. ఊహించని విజయాలు, అనూహ్యమైన పరాజయాలు నమోదయ్యాయి. వాటన్నింటిని గుదిగుచ్చి చూస్తే.. ప్రజల్లో ఆయా పార్టీలు గానీ, వారసత్వ రాజకీయాల మీద గానీ ఎంత మొహం మొత్తిపోయారనే విషయం స్పష్టమౌతోంది.
ప్రత్యక్ష ఎన్నికల్లో తేలిపోయిన సత్తా..
ఆంధ్రప్రదేశ్లో అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ను గెలిపించుకోలేకపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడనే అనుమానంతోనే.. లోకేష్ను ఎమ్మెల్సీని చేశారాయన. తన మంత్రివర్గంలో చోటు కూడా కల్పించారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం కూడా సురక్షితమైనదే. ఓటమికి ఏ మాత్రం అవకాశం లేనిదే. పార్టీ ఎమ్మెల్యేల కోటా కింద లోకేష్ శాసన మండలికి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రజా క్షేత్రంలో తన పలుకుబడి ఏమిటో, పార్టీ బలమేంటో నిరూపించుకోబోయి చేతులు కాల్చుకున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్.. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. ఇద్దరి మధ్య ఉన్న ఓట్ల ఆంతరం కూడా వేలల్లోనే ఉంది. సుమారు అయిదు వేలకు పైగా ఓట్ల తేడాతో లోకేష్ పరాజయం పాలయ్యారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రిగా ఉండి తన కుమారుడిని గెలిపించుకోలేకపోయారనే విమర్శలను మూటగట్టుకున్నారు.
కుమార్తెను గెలిపించుకోలేక..
ఇలాంటి పరిస్థితి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులూ ఎదుర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత.. 36 వేల ఓట్లకు పైగా తేడాతో పరాజయాన్ని చవి చూశారు. తన స్థానాన్ని ఆమె నిలబెట్టుకోలేకపోయారు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అరవింద్ చేతిలో ఓడిపోయారు. వరుసగా రెండోసారి గెలుపొందాలన్న ఆమె ఆశలు అడియాసలయ్యాయి.
అటు తండ్రి, ఇటు కుమారుడు.. ఇద్దరూ ఓటమే
జనతాదళ్ (యునైటెడ్) నేత, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిది విచిత్ర పరిస్థితి. సీఎం స్థానంలో ఉండి కూడా ఆయన తన తండ్రిని, కుమారుడిని ఓటమి కోరల నుంచి తప్పించలేకపోయారు. కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాన మంత్రి హెచ్ డీ దేవేగౌడ కర్ణాటకలోని తుమకూరు లోక్సభ నుంచి పోటీ చేశారు. సుమారు 13 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచీ దేవేగౌడ ఓడిపోవడం ఇదే తొలిసారి.
కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడ కూడా ఈ ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మండ్య లోక్సభ స్థానం నుంచి ఆయన జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసిన నిఖిల్.. తన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి, నటి సుమలత చేతిలో 90 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఖంగు తిన్నారు.
రాజస్థాన్లో అంతే..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ కూడా పరాజయం పాలయ్యారు. జోధ్పూర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన వైభవ్పై బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెఖావత్.. సుమారు రెండులక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. వాటన్నింటినీ బట్టి చూస్తే వారసత్వ రాజకీయాలపై ప్రజల్లో కొంత వ్యతిరేక భావం ఉన్నట్లు కనిపిస్తోంది.