టిటిడి అధికారులపై రమణదీక్షితులు ఆగ్రహం:తిరుపతి మీడియాపై నమ్మకం లేదని చెన్నైలో ప్రెస్ మీట్
తిరుపతి: తిరుమల కొండపై టిటిడి అధికారులు ఆగమశాస్త్ర విరుద్ధంగా కార్యక్రమాలను నిర్వహించి ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నారని రమణ దీక్షితులు ధ్వజమెత్తారు. అంతేకాదు శ్రీవారి ఆభరణాలకు సంబంధించిన లెక్కలను అధికారులు వెంటనే బహిర్గతం చేయాలని రమణదీక్షితులు డిమాండ్ చేశారు.
అధికారులపై తిరుమల శ్రీవారి ఆలయం ప్రధానార్చకులు రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలతో టిటిడిలో మళ్లీ వివాదం రాజుకుంది. అంతేకాదు ఆయన ఈ ఆరోపణలను సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాకుండా పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఆభరణాల భద్రతపై ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం పెను దుమారం రేపుతోంది.
తిరమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రధానార్చకులు రమణ దీక్షితులు చెన్నై వేదికగా చేసిన తాజా ఘాటు ఆరోపణలతో అలజడి రేగింది. పైగా ఆయన తనకు తిరుపతి మీడియాపై నమ్మకం లేదని, అందుకే చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు రమణ దీక్షితులు టిటిడి అధికారులను ఉద్దేశించి సూటిగా చేసిన ఆరోపణలతో కలకలం రేగుతోంది.
తిరుమల దేవస్థానంలో అనాదిగా వస్తున్న అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయటం ఆగమ శాస్త్ర విరుద్ధమని రమణ దీక్షితులు మండిపడ్డారు. 1996 వరకు వంశపారంపర్యంగా ఆలయ ఆభరణాలు సంరక్షిస్తూ వచ్చామని అయితే ఇప్పుడు ఆ ఆభరణాలకు లెక్కా పత్రం లేకుండా పోయిదని, జవాబుదారీతనం కరువైందని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఆభరణాలు అన్నీ భద్రంగా ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందని ఆయన మీడియా ముఖంగా రమణ దీక్షితులు సందేహం వెలిబుచ్చారు. ఈ ప్రభుత్వం భవిష్యత్తు తరాలకు వారసత్వ నిర్మాణాలు, ఆచారాలు కనిపించకుండా చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ధ్వజమెత్తారు. మాస్టర్ ప్లాన్ పేరిట శ్రీవారి ఆలయాన్ని, ఆగమ శాస్త్రాలను, హిందు మతాన్ని కనుమరుగు చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందని రమణ దీక్షితులు ఆరోపించారు.
ఈ పరిస్థితుల్లో టిటిడిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను ఫిర్యాదు చేసినట్లు రమణ దీక్షితులు తెలిపారు. టిటిడి విషయంలో అధికారులు, ప్రభుత్వంకు తెలిసే జరుగుతున్న అవినీతి నుంచి ఆలయాన్ని, స్వామివారిని కాపాడుకునేందుకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని రమణ దీక్షితులు పునరుద్ఘాటించారు.