నిమ్మగడ్డకు మళ్లీ షాక్- వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకాని సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు వైసీపీ సర్కారులోని అధికారుల సహాయ నిరాకరణ కొనసాగుతోంది. ఈ ఉదయం పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మధ్యాహ్నం ఏర్పాట్లపై చర్చించేందుకు రావాలని సీఎస్, డీజీపీ, పంచాయతీ రాజ్ అధికారులకు నిమ్మగడ్డ సమాచారం పంపారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్కు వారు హాజరు కాలేదు.
Recommended Video
మీకో న్యాయం- ఓటర్లకో న్యాయమా ?- అద్దాల ఛాంబర్లో నిమ్మగడ్డ ప్రెస్మీట్పై వైసీపీ ట్రోలింగ్
పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ను వాయిదా వేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అంతకుముందు నిమ్మగడ్డను కోరారు. అయితే ఈ అభ్యర్ధనను ఆయన తిరస్కరించారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని, వ్యాక్సిన్, ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ సరైన వేదికని నిమ్మగడ్డ సమాధానమిచ్చారు. అందరి సహకారంతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయగలమని నిమ్మగడ్డ పేర్కొన్నారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్కు తప్పనిసరిగా రావాలని కోరారు.
వీడియో కాన్ఫరెన్స్ వాయిదా వేయాలని తాము కోరినా నిమ్మగడ్డ పట్టించుకోకపోవడంతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, పంచాయతీ రాజ్శాఖ అధికారులు గిరిజాశంకర్, గోపాల కృష్ణ ద్వివేదీ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎలాగో సుప్రీంకోర్టులో సోమవారం ప్రభుత్వ పిటిషన్ విచారణకు వస్తున్నందున అప్పటివరకూ ఎన్నికలకు సహకరించరాదని అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ, రేపు ఎస్ఈసీ ఆదేశాలను వారు అమలు చేసే అవకాశాలు కనిపించడం లేదు.