ఆ కిక్కే వేరు: కాగల కార్యం జగనే తీర్చినట్టు: ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల చంద్రబాబు ఎగిరి గంతేస్తారా?
అమరావతి: కాగల కార్యం గంధర్వులే తీరుస్తారనేది ఓ సామెత. ఈ సామెత తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అతికినట్టు సరిపోయేలా ఉంది. తాను కోరుకున్న కార్యాన్ని తన ప్రత్యర్థే తీర్చడంలో ఉండే ఆ కిక్కే వేరుగా ఉంటుందనుకోవచ్చు ఆయన విషయంలో. ఇంతకీ ఏమిటా కార్యం?- అదే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ. కారణాలేమైనప్పటికీ.. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అటు ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో, ఇటు రాజకీయాల్లో ఏకకాలంలో కలకలం పుట్టిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలకు దారి తీయడానికి కారణమైంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఎల్వీపై బదిలీ వేటు: సీఎంఓ అధికారికి నోటీసు ఎఫెక్ట్: ప్రభుత్వంలో కలకలం..
చంద్రబాబు స్వాగతిస్తారా? లేక..
ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకున్నారనే విషయం గుర్తుండే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల కొద్దిరోజుల ముందు రాష్ట్రంలో చోటు చేసుకున్న హైడ్రామా నేపథ్యంలో, అత్యంత సున్నితమైన, సమస్యాత్మక పరిస్థితుల మధ్య ఎల్వీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలను చేపట్టినప్పటి నుంచీ ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇంటెలిజెన్స్ బ్యురో మాజీ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వర రావు సహా శ్రీకాకుళం, కడప జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలంటూ సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఏ మాత్రం పట్టించుకోలేదు.
అనిల్ చంద్ర పునేఠా స్థానంలో..
పైగా- ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యకలాపాల్లో తాము ఏ మాత్రం జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారం మొత్తం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపైనే వేటు వేసింది. అనిల్ చంద్ర పునేఠా తరువాత ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు. దీనికంతటికీ కారణం చంద్రబాబు నాయుడే అంటూ అప్పట్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.
ఎల్వీతో వైరం..
ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వతంత్రంగా వ్యవహరించారు. పోలింగ్ ముగిసిన తరువాత చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశాలకు ఆయన గైర్హాజరయ్యారు. ఫణి తుఫాన్ సమయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం సొంతంగా సమావేశాలను నిర్వహించారు. అదే ఫణి తుఫాన్ పై చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. రూల్ బుక్ ప్రకారం.. ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్వహించే మంత్రివర్గ సమావేశాలకు విలువ ఉండదని, వాటికి సీఎస్ స్థాయి అధికారి హాజరు కావడం సరికాదనేది ఎల్వీ వాదన. దీనిపై చంద్రబాబు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. మీడియాలో సైతం ఆయన వ్యవహారంపై నిప్పులు చెరిగారు.
ఆర్థిక శాఖను తన పరిధిలోకి..
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సూచించిన కొన్ని కీలకమైన జీవోలను విడుదల చేయడానికి ఎల్వీ నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని జారీ చేయబోమని చంద్రబాబుకు తేల్చి చెప్పారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలను ఎదుర్కొన్న నాటి ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్రను బదిలీ చేశారు. ఆ శాఖను తన పరిధిలోకి తీసుకొచ్చారు. ఆర్థిక శాఖకు సంబంధించిన కొన్ని కీలకమైన జీవోలను విడుదలను అడ్డుకోవడానికీ వెనుకాడలేదాయన. సాధారణ బడ్జెట్ విడుదల జీవోలు తప్ప.. కీలకమైన వాటినేవీ విడుదల చేయలేదు. ఈ చర్యలన్నీ చంద్రబాబుకు, ఎల్వీకి మధ్య దూరాన్ని పెంచాయి.
ఎల్వీ కొనసాగింపు..
విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని, ముక్కుసూటిగా వెళ్తారనే పేరు ఎల్వీకి ఉంది. ఇలాంటి వైఖరి ఉందన్న కారణంగానే ఎన్నికల తరువాత ఏర్పడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయననే కొనసాగించింది. ఈ అయిదు నెలల కాలంలో ఎక్కడ కూడా ఎల్వీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు రాలేదనే విషయం తెలిసిందే. ప్రభుత్వ పాలనా వ్యవహారాలను, యంత్రాంగాన్ని గాడిన పెట్టడానికి ఎల్వీ సూచనలు, సలహాలు ఉపయోగపడ్డాయనే అభిప్రాయాలు మంత్రుల్లోనూ వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో షోకాజ్ నోటిసుల వ్యవహారం ఆయనను ఇబ్బందుల్లో పడేసింది. బదిలీ అయ్యేలా చేసింది. ఎల్వీ బదిలీ వ్యవహారం చంద్రబాబును ఆనందంలో ముంచెత్తే ఉంటుందని అంటున్నారు.