వైఎస్ జగన్ వెంట సీఎస్! చంద్రబాబు హయాంలో ఇలా ఎప్పుడూ చూడలేదంటోన్న జనం
న్యూఢిల్లీ: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం దేశ రాజధానిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సమావేశమైన సందర్భంగా ఆయన వెంట ఉన్న ప్రతినిధుల బృందంలో.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఎల్వీ మినహా మిగిలిన అందరూ రాజకీయ నాయకులే. కొత్తగా లోక్సభకు ఎన్నికైన నందిగాం సురేష్, మార్గాని భరత్ రామ్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వీ విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. వీరంతా ప్రభుత్వ ప్రతినిథులుగా ప్రధానమంత్రిని కలిశారు.
వైఎస్ జగన్ తన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రధాని వద్దకు తీసుకెళ్లారు. ప్రధానికి పరిచయం చేశారు. అంతేకాదు- ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఓ వైపు ఎల్వీ మరోవైపు ఇంకో సీనియర్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ కూర్చున్నారు. దీనిపై నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త తరహా రాజకీయాలు, నవ శకం ప్రభుత్వ పరిపాలనకు వైఎస్ జగన్ నాంది పలికారని ప్రశంసిస్తున్నారు.
వైఎస్ జగన్తో భేటీపై మోడీ రియాక్షన్..!
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా తక్కువేమీ కాదు. ఆయన సంతకం లేనిదే ఏ ఫైలూ కదలదు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి సైతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకునే నిర్ణయాలకు తల ఊపాల్సిందే. ఆయన ఇచ్చే విలువైన సూచనలను అమలు చేయాల్సిందే. ప్రభుత్వ యంత్రాంగం మొత్తానికీ అధినేత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అలాంటి హోదా ఉన్న అధికారిని వెంట బెట్టుకుని ప్రధానమంత్రి వద్దకు వెళ్లడం, ఆయన చేతుల మీదుగా ఓ వినతిపత్రాన్ని అందజేయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఎల్వీ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా నరేంద్ర మోడీకి అందజేశారు వైఎస్ జగన్. దీనిపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి సన్నివేశాలను తాము ఎప్పుడూ చూడలేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబు ఎప్పుడు డిల్లీకి వెళ్లినా లేదా ప్రధానిని కలిసినా ఆయన పక్కన కంభంపాటి రామ్మోహన్ రావు, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి నేతలు కనిపిస్తుంటారని, ఆ తరహా సంప్రదాయానికి వైఎస్ జగన్ చెక్ పెట్టారంటూ కితాబు ఇస్తున్నారు. అధికారులను తగిన విధంగా గౌరవించడం చంద్రబాబుకు ఏమాత్రం తెలియదని, తాను చేసిన తప్పులను కూడా అధికారుల మీదికి నెట్టేయడం చంద్రబాబుకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం నేర్పిందంటూ చురకలు అంటిస్తున్నారు.