ఏపీలో మహిళలపై దాడి చేస్తే ఎన్కౌంటరే..!! సీఎం జగన్ చెప్పారంటూ చీఫ్ విప్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి జగన్ గొప్పతనాన్ని చాటుతూ..ప్రతిపక్షం తీరును ఎండగట్టే క్రమంలో చీఫ్ విప్ శ్రీకాంత రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. మహిళలపై ఎవరైనా దాడులు చేస్తే ఎన్కౌంటరైనా చేయండి..అంటూ ముఖ్యమంత్రి జగన్ పోలీసు అధికారులను ఆదేశించారని ఏకంగా చీఫ్ విప్ చెప్పటం ఇప్పుడు చర్చకు కారణమైంది. ముఖ్యమంత్రి ఎన్ కౌంటర్ చేయమని పోలీసులకు చెబుతారా.. దీనిని చీఫ్ విప్ మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. చంద్రబాబు హయాంలో అరాచకాలెన్నో జరిగాయంటూనే..ముఖ్యమంత్రి పాలనను అభినందిచే క్రమంలో శ్రీకాంత రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకండి..అని సీఎం చెప్పారని వివరించే వరకు బాగానే ఉంది. అయితే, చీఫ్ విప్ హోదాలో ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని.. అత్యుత్సహం తోనే అటువంటి మాటలు వచ్చాయంటూ సొంత పార్టీ నేతలే వ్యాఖ్యలు చేస్తున్నారు..
బాబు హయాంలో చేసిన అరాచకాలెన్నో..
ముఖ్యమంత్రి జగన్ పాలన చూస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కడుపు మంట అంటూ చీఫ్ విప్ శ్రీకాంత రెడ్డి ఫైర్ అయ్యారు. బాబు హయాంలో చేసిన అరాచకాలెన్నో ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో టీడీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన ధీటుగా సమాధానం ఇచ్చారు. తెదేపా నేతలు, కార్యకర్తల కోసం కలెక్టర్లు, ఎస్పీలు పనిచేయాలని చంద్రబాబు ఆదేశిస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మాత్రం శాంతిభద్రతల్లో ఎక్కడా రాజీపడకండి అని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని వివరించారు. 73 రోజుల పాలన అస్తవ్యస్తమంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతీ సందర్భంలో పులివెందుల పంచాయితీలంటూ ఓ ప్రాంతాన్ని, ప్రజలను కించపరుస్తున్నారంటూ తప్పు బట్టారు. పులి వెందులలో టీడీపీ అభ్యర్ధి సైతం పోటీ చేసారని..ఆయనకు అక్కడ ఓట్లు వచ్చాయని చెప్పిన శ్రీకాంత రెడ్డి వారు ప్రజలు కాదా అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు మోసాలు చేయటం రావని.. ఆ ప్రాంతం నుండి వచ్చిన చంద్రబాబు మాత్రం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి విషయాన్ని శ్రీకాంత రెడ్డి గుర్తు చేసారు. జగన్ పాలనలో ఏం అస్తవ్యస్తం అయిందంటూ శ్రీకాంత రెడ్డి నిలదీసారు.
వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరకాటంలో...
చంద్రబాబు పాలనలోని లోపాల గురించి శ్రీకాంత రెడ్డి గట్టిగానే మాట్లాడారు. తమ ప్రభుత్వంలో పోలీసుల పని తీరును సమర్ధించారు. ముఖ్యమంత్రి శాంతి భద్రతల విషయలో ఎంత కఠినంగా ఉంటుందీ వివరించే ప్రయత్నం చేసారు. అందులో భాగంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మహిళలపై ఎవరైనా దాడులు చేస్తే ఎన్కౌంటరైనా చేయండి, శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకండి, పోలీసులూ! సొంతంగా నిర్ణయం తీసుకోండి.. అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాలిచ్చారంటూ శ్రీకాంత రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. ముఖ్యమంత్రి హోదాలో జగన్ పోలీసులను ఎన్ కౌంటర్ చేయమని చెబుతారా.. శ్రీకాంత రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పాలనను సమర్ధించుకొనే ప్రయత్నం లో భాగంగా అత్యుత్సహంతో చేసినవిగా పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు . ముఖ్యమంత్రి హోదాలో జగన్ పోలీసులకు స్వేచ్చ ఇచ్చారని..అయితే అది రాజ్యంగానికి లోబడి మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి ఒత్తిడికి లొంగవద్దని.. తన పార్టీ లోని నేతలు చెప్పినా వినాల్సిన అవసరం లేదంటూ సీఎం జగన్ పోలీసులకు స్పష్టం చేసారు. అయితే, చీఫ్ విప్ హోదాలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళలపై ఎవరైనా దాడులు చేస్తే ఎన్ కౌంటరైనా చేయండి అంటూ చెప్పిన విషయమే ఇప్పుడు వివాదానికి కారణమైంది.
మరీ ఇంత ఓపెన్ గానా..
శ్రీకాంత రెడ్డి ముఖ్యమంత్రి సన్నిహితుడిగా పేరుంది. పార్టీలో..శాసనసభలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యమంత్రి పాలన గురించి ప్రశంసించే సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పార్టీ సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. మహిళల పైన దాడులు చేస్తే కఠినంగా ఉంటామనే సంకేతాలు ఇవ్వటాన్ని అందరూ ప్రశంసించే అంశమే. కానీ, ముఖ్యమంత్రి అటు వంటి వారిని ఎన్ కౌంటర్ చేయమన్నారంటూ చెప్పటం పైనే అభ్యంతరం వ్యక్తం అవుతోంది.