బాలుడి ప్రాణం తీసిన హోర్డింగ్:విషాదంలోనూ తల్లిదండ్రుల దాతృత్వం,చిన్నారి అవయవాల దానం
కడప: అడ్వరటైజ్ మెంట్ల కోసం ఏర్పాటు చేసిన ఓ భారీ డిస్ప్లే బోర్డు పదేళ్ల బాలుడి ప్రాణాన్ని బలిగొని ఓ ఇంట తీరని విషాదాన్ని నింపింది. కడప జిల్లాలో హోలీ పండుగ రోజునే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సంఘటన వివరాలు ఇవి...
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం జువారీ కాలనీలో నివసిస్తున్న కేవీ సుబ్రమణ్యంశర్మ, శ్రీలత దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్దవాడైన కృష్ణశ్రీనివాస్ (10) స్థానిక డీఏవీ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. హోలీ పండుగ స్కూళ్లకు సెలవు కావడంతో తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకని గ్రౌండ్ కు వెళ్లాడు. అందరూ ఆటల్లో నిమగ్నమై కేరింతలు కొడుతున్న సమయంలో పక్కనే ఉన్న భారీ ఐరన్ హోర్డింగ్ బోర్డు హఠాత్తుగా శ్రీనివాస్ మీద పడింది.
డిస్ ప్లే బోర్డు పడిన ప్రదేశంలో శ్రీనివాస్ మాత్రమే ఉండటంతో మిగిలిన బాలురు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. హోర్డింగ్ మీద పడి తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీనివాస్ ను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఈ విషయం తెలిసిన శ్రీనివాస్ కుటుంబం కుప్పకూలిపోయింది.
శ్రీనివాస్ తండ్రి సుబ్రమణ్యం శర్మకు అందరికీ సాయం చేసే వ్యక్తిగా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మంచి పేరు ఉంది. ఆయన అంత విషాదంలోనూ తన మంచితనాన్ని చాటుతూ కుమారుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. అంతటి విషాద సమయంలోనూ ఆ పరోపకార కుటుంబ సభ్యులు అందరూ అవయవదానానికి ఆమోదించారు. వెంటనే స్నేహ సేవా సమితికి చెందిన మధుసూదన్రెడ్డి, రాజమోహన్రెడ్డికి ఫోన్చేసి విషయం చెప్పగా వారు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ కళ్లు మాత్రమే తీసుకునే అవకాశం ఉండడంతో వారు కళ్లను తీసుకొని హైదరాబాద్కు తరలించారు. ఇంతటి తీవ్ర విషాద సమయంలోనూ వేరొకరికి పునర్జీవమిచ్చేందుకు ఆ తల్లిదండ్రులు చూపిన దాతృత్వం చాలా గొప్పదని విషయం తెలిసిన వారందరూ కొనియాడారు.