భళా అనిపించారు: స్నేహితురాలి పెళ్లి అడ్డుకున్న 10వ తరగతి విద్యార్ధులు
హైదరాబాద్: పదవ తరగతి చదివే పిల్లలు, తమ స్నేహితురాలి నిశ్చితార్ధానికి వెళ్లాలని టీచర్ పర్మిషన్ అడిగారు. దీంతో ఇంత చిన్న వయసులో పెళ్లి ఏంటని ప్రశ్నించిన ఆ టీచర్, బాల్య వివాహాలపై చిన్నారుల్లో అవగాహన కల్పించారు.
దీంతో ఆ పిల్లలు తమ స్నేహితురాలి నిశ్చితార్ధాన్ని అడ్డుకున్నారు. పిల్లలకు తోడుగా పోలీసులు, షీ టీమ్స్ రావడంతో కాసేపు వాదనలు జరిగినా, చివరికి ఆ బాలిక తల్లిదండ్రులు నిశ్చితార్ధాన్ని నిలిపివేసిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. ఆ అమ్మాయి నిశ్చితార్థానికి వెళ్లి వస్తామని కొందరు విద్యార్థినులు టీచర్ను పర్మిషన్ అడగటంతో, బాల్య వివాహాలపై ఉన్న నిషేధాన్నిటీచర్ క్లుప్తంగా వివరించారు.
మైనారిటీ తీరకుండా పెళ్లి చేసుకుంటే, వచ్చే సమస్యల గురించి వివరించారు. దీంతో ఆ పిల్లలు, స్నేహితురాలి పెళ్లి ఆపేందుకు సిద్ధమై, సహకరించాలని టీచర్ను కోరారు. 50 మంది విద్యార్థినీ విద్యార్థులు కలసి ఆమె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను నిలదీశారు.
తమ బిడ్డ తమ ఇష్టమని వాదించిన తల్లిదండ్రులకు, పోలీసులులు, మహిళా సంఘాలు కౌన్సిలింగ్ ఇచ్చాయి. దీంతో వారు చేసేదేమీ లేక నిశ్చితార్థాన్ని ఆపేసి, ఆ అమ్మాయిని తిరిగి పాఠశాలకు పంపేందుకు నిర్ణయించారు.
ఇలా పిల్లలు చేసిన పనికి చిత్తూరు పట్టణంలోని ఉన్నాతాధికారుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.