విశాఖలో పిల్లలదొంగలు .. బిజినెస్ బాగుందని బిడ్డను కూడా అమ్ముకున్న ఓ నిందితుడు
ఈజీ గా డబ్బు సంపాదించవచ్చన్న ఆలోచనతో ఓ గ్యాంగ్ పిల్లల్ని అపహరించి అమ్ముకోవడం ప్రారంభించింది. పిల్లలను ఎత్తుకుపోయి అమ్ముకుంటున్న ఈ ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఇక వీరి వద్దనుండి కూపీ లాగిన పోలీసులు వీరు అపహరించిన చిన్నారులను కాపాడటంతో పాటుగా, వీరు చిన్నారులను విక్రయించిన దంపతులను సైతం అరెస్టు చేశారు.
ఆ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతులు రాక.... రేపు చిరంజీవి పర్యటన వాయిదా
సులభంగా డబ్బు సంపాదించవచ్చు అని భావించి చిన్నారుల అపహరణకు పాల్పడుతున్న గ్యాంగ్
విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా చెప్పిన వివరాల ప్రకారం తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని ఆలోచనతో ఒక గ్యాంగ్ ఏర్పడిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు చిన్నారులను అపహరించి విక్రయిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో నెల క్రితం విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలానికి చెందిన నాగేరీ కాంతం కుమారుడిని అపహరించి విక్రయించడానికి ప్రయత్నించి ఈ గ్యాంగ్ అడ్డంగా దొరికిపోయారు. ఆరిలోవలో నివాసముంటున్న బోండా నాగమణికి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న తమ్మినేని సంపత్కుమార్తో కొన్నాళ్ల క్రితం పరిచయమైంది. ఈ క్రమంలో.. ఏలూరులోని తన చెల్లెలు సత్యవతికి పిల్లలు లేరని అతడు నాగమణికి చెప్పటంతో వీరు వుడా పార్కు వద్ద ఎనిమిది నెలల ఆడ శిశువుతో ఉన్న మహిళను ఏమార్చి, ఆ శిశువును ఎత్తుకుపోయి సత్యవతికి, ఆమె భర్త బిల్లా రాంబాబుకు రూ.50 వేలకు అమ్మేశారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5గురిని విక్రయించిన ముఠా
ఆ తర్వాత ఈ బిజినెస్ బాగుందని భావించి పిల్లలను ఎత్తుకెళ్లి విక్రయించటం స్టార్ట్ చేశారు. ఇదే క్రమంలో వారికి నాగమణి సోదరి లక్ష్మి కూడా సహకారం అందించింది. ఇక నాగమణికి ఆనంద్ అలియాస్ శేఖర్ అనే వ్యక్తి తోనూ పరిచయం ఏర్పడి అతనితో కూడా కలిసి పిల్లలను అపహరించి విక్రయించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఒక మూడు ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి విక్రయించడానికి ప్రయత్నించి, ఎవరూ కొనక పోవడంతో పాప దొరికింది అని చెప్పి పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత తగరపువలస వద్ద రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి లక్షా ఇరవై వేల రూపాయలకు బాలుడిని విక్రయించారు. ఇక ఆ తర్వాత ఆనంద్ ఈ బిజినెస్ బాగుంది అని భావించి తన మూడో కుమార్తెను జియావుద్దీన్ అనే వ్యక్తికి విక్రయించాడు.
ఒక బాలుడి విక్రయానికి ప్రయత్నిస్తుండగా ఈ గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు
ఈ క్రమంలో తనకు పరిచయమైన కాంతం అనే మహిళ కుమారుడైన అభిరాం ను ఆనంద్ కిడ్నాప్ చేశాడు. బాలుని అమ్మడానికి ప్రయత్నించి విజయనగరం , భీమిలి ప్రాంతాలలో వీలు కాకపోవడంతో ఏలూరు కి తీసుకెళ్లి విక్రయించాలి అనుకున్నారు. ఈ క్రమంలో ఏలూరు కి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో బోండా నాగమణి, జన్నెం ఆనంద్ అలియాస్ శేఖర్, తమ్మినేని సంపత్కుమార్, మడగళ్ల లక్ష్మిలతో పాటు వీరికి సహకరిస్తూ మధ్యవర్తులుగా ఉన్న మడగళ్ల జ్యోతి, చందన దేవిలను, అలాగే పిల్లలను కొనుగోలు చేసిన చందన ఈశ్వరరావు, బిల్లా రాంబాబు, మహ్మద్ జియావుద్దీన్.. వెరసి మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు సీపీ మీనా తెలిపారు. ఇక వీరు అపహరించిన ఐదుగురు పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు గా నగర పోలీస్ కమిషనర్ మీనా తెలిపారు.