‘పవన్ అంకుల్ నన్ను చూసేందుకు వస్తారు’: బ్లడ్ క్యాన్సర్ చిన్నారి
పశ్చిమగోదావరి: ఓ చిన్నారి అభిమాని ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ పేరునే తపిస్తూ ఆయనను చూడాలని కోరుకుంటోంది. ‘నాకు పవన్కల్యాణ్ అంటే ఎంతో ఇష్టం. అంకుల్ ఒక్కసారి నా దగ్గరకొస్తే జ్వరం తగ్గిపోతుంది. తప్పక పవన్ అంకుల్ వస్తారు' అని ఆ చిన్నారి అంటున్న మాటలతో అక్కడున్న వారిని కంటతడిపెట్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని పెదపేటకు చెందిన రత్నరాజు, రమాదేవిల కుమార్తె నూకల కనకచంద్రదీపిక(6). నీరసంగా ఉంటున్న చిన్నారిని నెల రోజుల కిందట ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు చెప్పిన మాటతో తల్లిదండ్రుల గుండెల్లో ఆందోళన మొదలైంది.
ఈ చిన్నారికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పడంతో వారు తల్లడిల్లిపోతున్నారు. చిన్నప్పటి నుంచి సినీహీరో పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టమని, ఉన్న చిన్న గది మొత్తం ఆయన చిత్రపటాలతోనే నింపేసిందని తల్లిదండ్రులు చెప్పారు. కాగా, ఈ వ్యాధి నివారణకు రూ. 20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తేల్చి చెప్పారు.
ఈ చిన్నారి వైద్యానికి అవసరమయ్యే కొన్ని పరీక్షలను బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేయించేలా రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మెడికల్ హైపవర్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఎం గోవిందరాజ్కుమార్ చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి చిన్నారి విషయం తీసుకెళ్లి త్వరలోనే వైద్యచికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉన్న ఇంటిని ఇప్పటికే వైద్యఖర్చుల నిమిత్తం తనఖా పెట్టినట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. మరింత నగదు అవసరం కావడంతో దాతల సాయం కోసం చిన్నారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.
కాగా, తన పరిస్థితి తెలియని ఆ చిన్నారి తనకేదో జ్వరం వచ్చిందని, పవన్కల్యాణ్ అంకుల్ వచ్చి చూస్తే తగ్గిపోతుందని చెబుతోంది. చిన్నారి మాటలు తల్లిదండ్రులు, అక్కడున్నవారికి కంటతడిపెట్టిస్తున్నాయి. గతంలో ఇలాగే ఓ చిన్నారిని కలిసిన పవన్ కళ్యాణ్.. ఈ చిన్నారిని కూడా కలిసే అవకాశం లేకపోలేదు.