pawan kalyan-చిన్న ప్రశ్న: ‘హిందూ దేవాలయాలే ఎందుకు పన్నులు కట్టాలి?’
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృ భాష తెలుగును కాపాడాలంటూ నినదిస్తున్న విషయం తెలిసిందే. తాము ఆంగ్ల మాధ్యమాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. అయితే తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా, ఆయన రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ పలు ట్వీట్లు చేశారు. హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ప్రభుత్వాలు ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నాయంటూ చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రశ్నిస్తున్న వీడియోను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
రాజ్యాంగంలోని ముందుమాట
రాజ్యాంగంలోని ముందుమాటను పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఆర్టికల్ 26, ఆర్టికల్ 27.. కొన్ని ప్రశ్నలు..
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హజ్ యాత్రికులకు, జెరూసలేం యాత్రికులకు సబ్సిడీలు పెంచడం పట్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతో సహా అన్ని సెక్యులర్ ప్రభుత్వాలకి మా నుంచి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి' చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు.
దేవాలయాల ఆదాయంలో నాలుగో వంతు ప్రభుత్వాలకే..
‘సెక్యులర్ రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాల ఆదాయం నుంచి ఏటా 23.5శాతాన్ని వివిధ పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాయి. ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్స్ టాక్స్ రూపంలో 15 శాతం, ఆడిట్ ఫీజు రూపంలో 2శాతం, కామన్ గుడ్ ఫండ్ నిమిత్తం మరో 2 శాతం.. ఇవే కాకుండా అర్చక వెల్ఫేర్ ఫండ్, ఇతర పన్నుల రూపంలో ఆలయాల ఆదాయంలో నాలుగో వంతుని ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి' అని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అన్నారు.
హిందూ దేవాలయాలే ఎందుకు పన్నులు కట్టాలి.. రాజ్యాంగం ఏం చెప్పింది?
‘ఏ ఒక్క చర్చి కానీ, మసీదు కానీ ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించడం లేదు. కేవలం దేవాలయాలు మాత్రమే ఎందుకు పన్నులు చెల్లించాల్సి వస్తోంది? భారత రాజ్యాంగంలోని 26వ అధికరణం ప్రకారం ధార్మిక సంస్థల నుంచి ప్రభుత్వాలు ఎలాంటి పన్నులూ వసూలు చేయకూడదు. మరి దేవాలయాల నుంచి మాత్రమే పన్నులు ఎందుకు వసూలు చేస్తుస్తున్నారు? ఈ చిన్న ప్రశ్నకి జవాబివ్వడి చాలు' అని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అన్నారు.