కెసిఆర్తో భేటీ: టీలో చైనా కంపెనీ విద్యుత్ ప్లాంట్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో మంగళవారంనాడు చైనాకు చెందిన డాంగ్ఫాంగ్ ఎలక్ట్రికల్ కార్పోరేషన్ ప్రతినిధులు సచివాలయంలో కలిశారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు.
తెలంగాణలో 650 నుంచి వేయి మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వారు ముందుకు వచ్చారు. వారి ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారు. డాంగ్ఫాంగ్ కంపెనీకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. కెసిఆర్ చైనాలోని కంపెనీని సందర్సించేందుకు ఆసక్తి కనబరిచినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
ఇదిలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధాన కార్యదర్సి రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎంసెట్ కౌన్సెలింగ్, ఫాస్ట్ మార్గదర్శకాలు, బోధనారుసుం బకాయిలపై ఆయన చర్చించినట్లు సమాచారం.
స్పెషల్ ఇంక్రిమెంట్లు
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ స్పెషల్ ఇంక్రిమెంట్ ఫైల్పై సంతకం చేశారు. ఆగస్టు 2014 జీతంతో పాటు ఈ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఉద్యోగులకు సర్వీసులో ఉన్నంత కాలం జీతాలతో పాటు అందుతుంది.
ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులతో పాటు యుజిసి, ఎఐసిటిఈ ఆమోదం పొందిన విశ్వవిద్యాలయాల ఉద్యోగులకు కూడా ఈ తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ అందుతుంది.