కావాలనే చేశాం: సాక్షి టీవీ ప్రసారాల బంద్పై చినరాజప్ప
విజయవాడ/ గుంటూరు: రాష్ట్రంలో కొన్ని మీడియా చానెళ్లను కావాలనే నియంత్రించామని డిప్యూటీ ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సాక్ి టీవీ ప్రసారాలను ఎందుకు ఆపేశారని అడిగితే కొన్ని చానెళ్లను నియంత్రించామని సమాధానమిచ్చారు. శాంతి భద్రతల సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో నియంత్రించినట్లు తెలిపారు.
ముద్రగడ దీక్ష కొనసాగే వరకు ఈ నియంత్రణ కొనసాగుతుందని, ఆయన పరోక్షంగాచెప్పారు. దీక్షకు మద్దతు ఇస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని వాటిని ఆపేసినట్లు తెలిపారు. ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షకు ప్రజల మద్దతు లేదని ఆయన అన్నారు.
ముద్రగడ అరెస్టుకు నిరసనగా కాపులు శుక్రవారం తలపెట్టిన తూర్పు గోదావరి జిల్లా బంద్ విఫలమైందని, పోలీసులు బంద్ను విజయవంతం కానివ్వరని ఆయన చెప్పారు. శనివారంనాటి బంద్ను కూడా విఫలం చేస్తామని ఆయన చెప్పారు.
కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను అడ్డుపెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అద్యక్షుడు వైయస్జగన్ కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి చినరాజప్ప ఆరోపించారు.
తుని ఘటన నిందితులను విడుదల చేయాలనడం సరికాదని ఆయన అన్నారు. శాంతిభద్రతలను కాపాడడం తమ బాధ్యత అని ఆయన స్ఫష్టం చేశారు. ముద్రగడ దీక్ష విరమించాలని సూచించారు. కేసులను ఉపసంహరించే ప్రసక్తే లేదని చెప్పారు. కాపు యువకులు కేసుల్లో ఇరుక్కోవద్దని చినరాజప్ప హెచ్చరించారు.
తుని ఘటన కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని చినరాజప్ప స్పష్టం చేశారు. తుని కేసును మూడు నెలల క్రితమే సీఐడీకి అప్పగించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారని, వారికి కోర్టు రిమాండ్ విధించిందన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అమాయకులెవరూ లేరని ఆయన తెలిపారు.
ముద్రగడ పద్మనాభం రాజమహేంద్రవరం ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారని చినరాజప్ప తెలిపారు. దీక్ష విరమించాలని వైద్యులు కోరుతున్నప్పటికీ ఆయన అంగీకరించడం లేదని చెప్పారు. తుని కేసు కోర్టులో పరిధిలోకి వెళ్లినందున ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకోవడం సాధ్యం కాదన్నారు.
ముద్రగడ మొండి వైఖరితో కాపులకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని అలాంటి వారి వలలో కాపులు పడొద్దని సూచించారు. కాపుల సమస్యలపై వైసిపి నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నేతలంతా అప్పుడు కాపుల సంక్షేమానికి ఎందుకు కృషి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాపుల సమస్యలపై ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబును లేదా కాపుకార్పొరేషన్ను కాలవాలని అలా కాకుండా కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి,చిరంజీవి, దాసరి నారాయణరావు, వైసీపీ నేత బొత్స సత్యనారాయణలను ఎందుకు కలిశారని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ ప్రశ్నించారు. వీరిని కలవడం వెనుక వైసీపీ నేత జగన్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. తుని ఘటనలో అరెస్ట్ అయినవారిలో సగం మంది కాపు కులస్తులు కాదని రామానుజయ వెల్లడించారు.