చినరాజప్ప పై వేటు తప్పదు..! నేనే ఎమ్మెల్యేను అంటున్న వైసీపీ అభ్యర్థి..!!
కాకినాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో కొద్దో గొప్పో గెలిచిన ప్రజా ప్రతినిధుల పట్ల వివాదాలు అలుముకుంటున్నాయి. మొన్న గుంటూరు టీడిపి ఎంపి గల్లా జయదేవ్ మీద అనర్హత ఆరోపణలు రాగా నేడు మరో టీడిపి ఎమ్మెల్యే పైన ఇలాంటి ఆరోపణలే ఘుప్పు మంటున్నాయి. దీంతో గెలిచిన కొద్ది మంది ప్రజా ప్రతినిధులు కూడా కుదురుగా ఉండలేని పరిస్థితులు తలెత్తాయి. మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప గెలుపుపై... వైసీపీ అభ్యర్థి తోట వాణి హైకోర్టును ఆశ్రయించారు.
ఎన్నికల అఫిడవిట్లో క్రిమినల్ కేసులు, ఆదాయ వనరులు దాచిపెట్టి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్టు హైకోర్టులో వాణి అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వాణి.. 2007లో ఓబులాపురం మైనింగ్ కార్యాలయంపై దాడి చేసిన కేసులో చినరాజప్ప 15వ ముద్దాయిగా ఉన్నారని విమర్శలు గుప్పించారు.
Recommended Video
ఈ కేసు క్లోజ్ చేయమని 2016, 2018లో ప్రభుత్వ జీవోలు రెండుసార్లు విడుదల చేయించి కోర్టుకు పంపించారని ఆమె చెప్పుకొచ్చారు. అయినప్పటికీ సాంకేతిక కారణాలతో కోర్టు తిరస్కరించి వారెంట్ కొనసాగిస్తోందని వాణి తెలిపారు. అఫిడవిట్లో మాత్రం కేసులు లేవని చినరాజప్ప ప్రకటించారని వాణి ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఫెన్షన్, ఆపద్ధర్మ డిప్యూటీ సీయంగా పొందుతున్న జీత భత్యాలను దాచిపెట్టి తనకు కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే ఆదాయం వస్తున్నట్టు రాజప్ప ప్రకటించారని వైసీపీ అభ్యర్థి ఆరోపించారు. "ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధం. ఆరునెలల్లో హైకోర్టు రాజప్పపై అనర్హత వేటు వేస్తుందని భావిస్తున్నాం. ఆ తర్వాత నేనే పెద్దాపురం ఎమ్మెల్యేను అవుతాను" అని తోట వాణి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఈ పిటిషన్పై టీడీపీ నేతలు, చినరాజప్ప ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.