చంద్రబాబును విమర్శించే స్థాయి కాదు.. విజయసాయిపై చినరాజప్ప ఫైర్
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీమంత్రి చినరాజప్ప ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబును విమర్శించే స్థాయి తమరిది కాదు అని విరుచుకుపడ్డారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి.. ఇతరులపై కామెంట్స్ చేసే ముందు ఆలోచించాలని కోరారు. చంద్రబాబు లాంటి నేతపై ఆరోపణలు చేసే స్థాయి కాదని.. ఆయనది తెరచిన పుస్తకం అని చెప్పారు. ఇప్పటికే వేసిన పలు కేసుల్లో ఆయన నేరాభియోగాలు ఏమీ లేవు అని కోర్టులు క్లీన్ చీట్ ఇచ్చాయని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై మాట్లాడే అర్హత విజయసాయిరెడ్డికి లేదని పెద్దాపురం ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. త్వరలో సీఎం జగన్ అక్రమ ఆస్తుల కేసులో తీర్పు వస్తుందని తెలిపారు. ఆ కేసులో జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. జగన్తోపాటు విజయసాయి రెడ్డికి కూడా శిక్ష తప్పదని చెప్పారు. వారిద్దరూ జైలుకెళ్లడం ఖాయం అని కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు.
దివిస్ విషయంలో తుని వైసీపీ ఎమ్మెల్యే చేతుల్లో ఏమీ లేదని చినరాజప్ప తెలిపారు. అక్కడ అంతా విజయసాయిరెడ్డి కనుసన్నల్లో జరుగుతుందని చెప్పారు. కానీ ఇతరులపై తేలికగా ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. అందుకు వరసగా జరుగుతున్న ఘటనలే ఉదహరణ అని స్పష్టంచేశారు. అన్నీ వ్యవస్థలను జగన్ సర్కార్ నిర్వీర్యం చేశారని విరుచుకుపడ్డారు. ఈ విషయాలు ప్రజలందరికీ తెలుసు అని వెల్లడించారు.