ఏపీ నుంచి బెంగళూరు మెట్రోరైలు బోగీల సరఫరా: రూ.855 కోట్ల పెట్టుబడికి చైనా సంస్థ రెడీ:
చిత్తూరు: చైనాకు చెందిన అతి పెద్ద రైల్వే బోగీల తయారీ సంస్థ సీఆర్ఆర్సీ నాన్జింగ్ పుజెన్ కార్పొరేషన్ మన రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్)కు చెందిన దక్కించుకున్న ఆ సంస్థ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో ర్యాకుల తయారీ యూనిట్ను నెలకొల్పబోతోంది. బెంగళూరు మెట్రో రైలు రెండోదశ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టు అది.
ఈ కాంట్రాక్టు కింద సీఆర్ఆర్సీ కార్పొరేషన్ బెంగళూరు మెట్రో రైల్వే రెండోదశ ప్రాజెక్టు కోసం 216 బోగీలను తయారు చేయాల్సి ఉంటుంది. బెంగళూరుకు సమీపంలో ఉన్నందున ఈ తయారీ యూనిట్ను నెలకొల్పడానికి శ్రీసిటీ ఎంపిక చేసింది. ఈ కాంట్రాక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ (ఎల్ఓఏ)ని బెంగళూరు మెట్రో రైల్వే అధికారులు సీఆర్ఆర్సీ కార్పొరేషన్ ప్రతినిధులకు అందజేశారు.
ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీన బెంగళూరు మెట్రో రైల్వే రెండోదశ పనులు ఆరంభం కానున్నాయి. రెండోదశ కింద బీఎంఆర్సీఎల్ అధికారులు మొత్తం 36 రైళ్లను వేర్వేరు మార్గాల్లో నడిపించనున్నారు. ఒక్కో రైలుకు ఆరు ర్యాకులు ఉంటాయి. ఈ ర్యాకుల తయారీ కోసం బీఎంఆర్సీఎల్ అధికారులు గ్లోబల్ టెండర్లను పిలిచారు. సీఆర్ఆర్సీ కార్పొరేషన్ 8,549,498,321 రూపాయలతో లోయెస్ట్ బిడ్డింగ్తో ఎల్ 1గా నిలిచింది. దీనితో ఆ సంస్థకు ర్యాకుల తయారీని అప్పగించారు.
ఇందులో భాగంగా- డీటీజీ సిగ్నలింగ్ వ్యవస్థ గల 126 మెట్రో బోగీలు, సీబీటీసీ సిగ్నలింగ్ వ్యవస్థ గల 90 మెట్రో రైలు బోగీలను సీఆర్ఆర్సీ సంస్థ తయారు చేయాల్సి ఉంటుంది. ముంబై మెట్రో-64, గుర్గావ్ ర్యాపిడ్ మెట్రో-36, నవీ ముంబై మెట్రో-24, కోల్కత-112, నొయిడా మెట్రో-76, నాగ్పూర్-99 బోగీలను ఇప్పటికే ఈ సంస్థ తయారు చేసింది. దీనికోసం వేర్వేరు ప్రాంతాల్లో తయారీ యూనిట్లను నెలకొల్పింది. తాజాగా శ్రీసిటీలో తయారీ యూనిట్ను నెలకొల్పబోతోంది.