విచారణలో కీలకంగా జగన్ చొక్కా: అనుమానాలు అవసరం లేదన్న చినరాజప్ప
విశాఖపట్నం: కత్తి దాడి ఘటన ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చొక్కా కూడా విచారణలో కీలకంగా మారుతోంది. విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగినప్పుడు ధరించిన చొక్కాను జగన్ నుంచి స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించాలని విశాఖ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్లు విశాఖ పశ్చిమ ఏసీపీ ఎల్ అర్జున్ వ్యాఖ్యానించారు.
పరిశీలనకు జగన్ చొక్కా
బుధవారం రాత్రి ఆయన ఎయిర్పోర్ట్ పోలీసుస్టేషన్లో మీడియాతో మాట్లాడారు. హత్యాయత్నం జరిగినప్పుడు ధరించిన చొక్కాకు రక్తం అంటడంతో జగన్ దాన్ని మార్చుకుని, మరొకటి వేసుకుని విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లారని తెలిపారు. ఆ చొక్కాను పరిశీలించాల్సి ఉందని తెలిపారు.
మధ్యప్రదేశ్ నుంచి శ్రీనివాస్ స్నేహితుడు
నిందితుడు శ్రీనివాసరావు సెల్ఫోన్ల కాల్ డేటాను విశ్లేషించామని, 321 మందితో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించామని తెలిపారు. మధ్యప్రదేశ్లో ఉంటున్న శ్రీనివాసరావు స్నేహితుడు కూడా విశాఖ వచ్చాడని అతని నుంచీ సమాచారం రాబడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శ్రీనివాస్కు పూర్తిస్థాయిలో భద్రత
జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్ కు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. విపక్ష నేతలు ఈ అంశంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, కేసు విచారణలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కేసు విచారణ, శ్రీనివాస్ కు భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని తెలిపారు.
వస్తున్నా! బాబు డబ్బులిచ్చారా? బూట్లూ నాకే వారికి గుంటూరు కారం తినిపిస్తా: శివాజీ ఘాటు వ్యాఖ్యలు
ప్రాణాపాయమంటూ శ్రీనివాస్
మరోవైపు, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని శ్రీనివాస్ వేడుకున్న విషయం తెలిసిందే. తనను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం కేజీహెచ్ కు తరలిస్తున్న సమయంలో మీడియాకు ఈ విషయాన్ని తెలిపాడు. ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.