'దరిద్రపు జాతి'పై ముద్రగడకు రివర్స్: బాబు క్లాస్తో గంటా ఎదురుదాడి!
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ పైన ఏపీ మంత్రులు, టిడిపి నేతలు.. సీఎం చంద్రబాబు కూడా ఎదురుదాడి ప్రారంభించారు. ఈ దరిద్రపు జాతి అంతరించిపోవాలన్నదే మీ కోరికగా కనిపిస్తోందని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.
దీనిపై మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. అదే సమయంలో ముద్రగడ లేఖ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ లేఖ వెనుక జగన్ ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కూడా ముద్రగడ లేఖ పైన అనుమానం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం రాసిన లేఖల వెనుక వైసిపి అధినేత జగన్ హస్తం ఉందని నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. వైసిపి నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతుండడంతో ఆందోళనలో ఉన్న జగన్ ఒక్కో అక్షరం చెబుతుంటే.. వాటికనుగుణంగా ముద్రగడ లేఖ రాసినట్లు అనిపిస్తోందన్నారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి లేఖ రాసేటప్పుడు ఎలాంటి పదజాలం వాడాలో కూడా ముద్రగడకు తెలియదా? అని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడే తరహాలోనే ముద్రగడ లేఖలో వాక్యాలున్నాయని, ఇచ్చిన సమయంలోగా హామీలు పూర్తిచేయకపోతే అప్పుడు నిలదీయాలన్నారు.
ఓ వైపు మందకృష్ణ మాదిగ, మరోవైపు ముద్రగడ ఈ నెల 10వ తేదీనే దీక్షలు, సభలు చేస్తామంటూ ముహూర్తం పెట్టడం వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలిసిందే అన్నారు. ముద్రగడ, మందకృష్ణలు ఓకే డెడ్ లైన్ పెట్టడం అనుమానాలకు తావిస్తోందని, వారి వెనుక జగన్ ఉన్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. కాగా, ముద్రగడ కూడా డెడ్ లైన్కు ముందే స్పందించడాన్ని కూడా టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు.
కాపులకు న్యాయం చేసేది టిడిపినే: గంటా
కాపులకు న్యాయం చేసేది టిడిపి మాత్రమేనని మంత్రి గంటా శ్రీనివాస రావు గురువారం నాడు చెప్పారు. ప్రభుత్వంలో కీలక పదవులు కాపులకే ఇచ్చామని చెప్పారు. కాపులకు రుణాలు ఇస్తున్నామన్నారు. కాగా, చంద్రబాబు క్లాస్ నేపథ్యంలో ముద్రగడ వ్యాఖ్యలను గంటా ఖండించారు.