జగన్పై ఏపీ హోం మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: దేశ, విదేశాల్లో ఉన్న భక్తులకు ఆరాధ్యదైవమైన పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకలు నేడు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఈ ఉదయం 8 గంటలకు వేదమంత్రోచ్చారణ నడుమ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. బాబా సమాధివద్ద కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు రూ. 80 కోట్లతో నిర్మించిన తాగునీటి పథకాన్ని చినరాజప్ప ప్రారంభించారు.
సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని ట్రస్టు సభ్యులను కోరారు. ప్రభుత్వం తన పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. బాబా జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి చేరుకున్నారు. ఈ ఉత్సవాలకు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి కూడా హాజరయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ భారీ స్థాయిలో అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ప్రతి కేసులోనూ జగనే ప్రథమ ముద్దాయిగా ఉన్నారని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయని అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపామని అన్నారు. ప్రభుత్వ చర్యలతో అక్రమ రవాణాను చాలామేరకు తగ్గించగలిగామని తెలిపారు.