బాబుతో కలిసి కూర్చో: కేసీఆర్కు రాజప్ప, ఈడీ ఆటాచ్పై జగన్కు చురక
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప శుక్రవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈడీ తన రూ.750 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేస్తే జగన్ స్పందించక పోవడం విచిత్రమని, శోచనీయమని అన్నారు. తెలంగాణ సీఎం, తెరాస నేతలు హైకోర్టు విభజన పైన ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఏమాత్రం సరికాదన్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆల్, చంద్రబాబు, కేంద్రం కూర్చొని చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుందని చినరాజప్ప అన్నారు. ఓ ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పడం సరికాదని చెప్పారు. గోదావరి పురష్కాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, ఆస్తుల అటాచ్ నేపథ్యంలో జగన్ న్యాయవాదులతోను సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఒకేసారి రూ.750 కోట్లు అటాచ్ కావడం జగన్ను భారీ షాక్కు గురి చేసింది. అటాచ్మెంటుకు సంబంధించిన నోటీసులు ఈడీ అధికారులు జగన్కు అందించినట్లుగా తెలుస్తోంది.
చిన్న టెక్నికల్ సమస్యతో అడ్డుకున్నారు: కొల్లు
హైదరాబాద్ నుంచి అమరావతికి 80 శాతం కార్యాలయాలు వచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఒకేచోట బీసీ కార్పోరేషన్, బీసీ ఫెడరేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖకు చెందిన ఫైల్స్ సాఫ్ట్ కాపీని తెలంగాణకు ఇచ్చామని, చిన్న సాంకేతిక సమస్య వల్ల తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారన్నారు. సమస్యను పరిష్కరించి ఫైళ్లు తీసుకు వస్తామన్నారు.