35ఏళ్లలో నన్ను టచ్ చేయలేదు: కేసీఆర్పై ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తన లాంటి వారి పైనే దాడులు జరుగుతుంటే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని, తనను ఇంత వరకు ఎవరు టచ్ చేయలేదని ఎమ్మెల్యే చిన్నారెడ్డి మంగళవారం వాపోయారు. నిన్న (సోమవారం) తన పైన జరిగిన దాడి రోజు తనకు దుర్దినం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియంతలా పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. దాడులకు పాల్పడ్డ వ్యక్తుల పైన ఇప్పటి వరకు పోలీసులు కూడా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 35 ఏళ్ల తన రాజకీయ జీవితంలో చేతితో తనను ఇంత వరకు ఎవరూ టచ్ చేయలేదన్నారు.
ఎదుర్కొనే సత్తా ఉంది: భట్టి
తెరాస దాడులను ఎదుర్కొనే సత్తా తమకు ఉందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తమ పార్టీ నేతల పైన, కార్యకర్తల పైన దాడులు జరిగితే ఊరుకునేది లేదన్నారు. చిన్నారెడ్డి పైన దాడి ఫాసిస్ట్ విధానమని, దీనిని ఖండిస్తున్నామని అంతకుముందు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగడాలను గవర్నర్ నిలువరించాలన్నారు.
హైకోర్టు ఆదేశాలు పాటించరా: గుత్తా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పార్లమెంటరీ కార్యదర్శులను ఇంకా కొనసాగిస్తోందన్నారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు.
31న మాక్ పోలింగ్
అంతకుముందు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ పైన చర్చించారు. అందరు ఒక ఓటు వేయాలని నిర్ణయించారు. 31న మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.