పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఇచ్చేందుకు సిద్ధం...మంత్రి చినరాజప్ప సంచలనం
రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు.కాగా పోలవరం ప్రాజెక్టుపై హోమంత్రి చినరాజప్ప ప్రకటన సంచలనం సృష్టించింది.
నిన్నటిదాకా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం లేదని వాదిస్తున్న తరుణంలో చినరాజప్ప ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
కేంద్రప్రభుత్వం సహకారంతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతామన్నారు. అయితే సంప్రదాయాల కోసం చట్టాన్ని అతిక్రమించరాదని, అది కరెక్ట్ కాదని మంత్రి అన్నారు. గోదావరిలో నీటిమట్టం తగ్గినా సీలేరు, బలిమెల రిజర్వాయర్ల నుంచి నీటిని తరలించి రబీ పంటను కాపాడితీరుతామని చినరాజప్ప చెప్పారు.