చింతా మోహన్ చెప్పింది ఇదేనా?...గుర్తుకొస్తున్నాయి!
అమరావతి: మిత్ర పక్షాలైన టిడిపి-బిజెపి శత్రు పక్షాలుగా మారిన వైనం...గతంలో టిడిపికి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ అదే తెలుగుదేశం పార్టీపై విమర్శల వర్షం కురిపించడం...ప్రతిపక్ష పార్టీ వైసిపి పేరెత్తితేనే ఛీత్కరిస్తున్నట్లు వ్యవహరించే టిడిపి...అదే పార్టీ పెడుతున్నఅవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం...ఈ విషయాలన్నీ ఒక్కసారి మననం చేసుకోండి...ఇక్కడ కట్ చేసి...ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే...
సుమారుగా రెండున్నర నెలల క్రితం మాజీ ఎంపి చింతా మోహన్ చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుందాం...తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో పెను మార్పులు సంభవించనున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఏపీ రాజకీయాల్లోకి నీతి, నిజాయితీ కలిగిన ఒక నాయకుడు వస్తున్నాడని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు...ఆరోజున ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పుడున్న పరిస్థితులేవీ అప్పుడు లేవు. అయితే అప్పుడు చింతా మోహన్ చెప్పింది ఈ పెను మార్పుల గురించేనా...అలాగయితే తరువాత ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసా...
చింతా మోహన్ నాటి వ్యాఖ్యలు...ఫ్లాష్ బ్యాక్
నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకొని జనవరి 1 సోమవారం నాడు తిరుమల శ్రీవారిని మాజీ ఎంపి చింతా మోహన్ దర్శించుకొన్నారు. సుదీర్ఘ కాలంపాటు ఆయన తిరుపతి ఎంపీగా చింతా మోహన్ ప్రాతినిథ్యం వహించారు. ఈ సందర్భంగా ఆయన చాలాకాలం తర్వాత రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై చింతా మోహన్ చేసిన కామెంట్లు చర్చకు దారితీశాయి. అయితే చింతా మోహన్ నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో నీతి , నిజాయితీ గల నాయకుడు వస్తున్నాడని మాజీ ఎంపి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తులు సంపాదించాలనే కోరిక లేని నాయకుడు రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు.
ఆయనే...ఇంకా ఏమన్నారంటే...
త్వరలోనే అలాంటి నాయకుడు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయాలను మాత్రం చింతామోహన్ స్పష్టం చేయలేదు. దేవుడినే అడిగాను ఏపీ రాజకీయాల్లోకి ఆస్తులు సంపాదించాలనే కోరిక లేని నాయకుడిని ఏపీ రాష్ట్రానికి భాద్యతలు స్వీకరించేందుకు పంపాలని దేవుడినే కోరుకొన్నానని చింతా మోహన్ చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు బాగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ రాజకీయాల్లో మార్పులు ఏపీ రాజకీయాల్లో త్వరలోనే పెద్ద ఎత్తున మార్పులు వచ్చే అవకాశం ఉందని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.
అప్పుడే విస్తృతంగా చర్చ...ఆ తర్వాత మరుగున...
2019లో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి...అయితే ఆ ఎన్నికల సమయం నాటికే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయని చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. దీంతో చింతా మోహన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించడంతో పాటు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలకు మేలు చేసే నాయకుడిని రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టేలా భగవంతుణ్ణి ప్రార్థించినట్టు ఆ సందర్భంలో చింతా మోహన్ చెప్పడం గమనార్హం.
అయితే పవనా అంటే...కాదన్నారు...
అయితే ఆయనొస్తున్నాడు అంటూ చింతా మోహన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీరు చెప్పే ఆయన ఎవరు?...పవన్ కళ్యాణా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చింతా మోహన్ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదన్నారు. అంతేకాదు...జనసేన పార్టీకి ఎన్నికల చిహ్నం లేదని ఆయన చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదన్నతిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అసలు పవన్ ఎవరో తనకు తెలియదనడం విచిత్రంగా అనిపించింది.
పవన్ ఒక్క స్పీచ్ తో...రాజకీయాల్లో పెను ప్రకంపనలు
అయితే తిరుమల శ్రీవారి సన్నిధిలో మాజీ ఎంపి చింతా మోహన్ ఎలాంటి పెను మార్పుల గురించి అయితే చెప్పారో అలాంటి మార్పులే రాష్ట్రంలో చోటుచేసుకోవడం...ఒక్క స్పీచ్ తో పవన్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించడం...చింతా మోహన్ వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నాయి. జరగబోయేదేంటో తనకు ముందే తెలిసినట్లుగా చింతా మోహన్ చెప్పడం...మరోవైపు ఎపిలో కాపు-ఎస్సీల కాంబినేషన్ లో రాజ్యాధికారం దక్కించుకునేలా చింతామోహన్, మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుండటం, అలాగే చంద్రబాబు, జగన్ రాజకీయాలతో జనం విసిగిపోయారని చెప్పడం, కుల రాజకీయాలకు వారు ముగింపు పలకాలని వ్యాఖ్యానిస్తుండటం...పవన్ కళ్యాణ్ కూడా ...అధికారం కొన్ని కులాల కేనా...కుదరదు చెప్పడం...ఇవన్నీ చూస్తుంటే...వీటన్నింటికీ ఏదో లింక్ ఉందనే అనిపిస్తోంది. కానీ ఈ విషయమై చింతా మోహన్ నుంచి అతి త్వరలోనే స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని ఆశిద్దాం...