తిరుపతిలో ఈసారి ఓటు రేట్లివే- కాంగ్రెస్కు లక్ష మెజార్టీ- చింతామోహన్ మరో షాకింగ్
తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తిరుపతిలో పోలింగ్ సందర్భంగా ఓటర్లకు పంచే డబ్బులెంతో కూడా చెప్పేశారు. సామాన్య కుటుంబంలో పుట్టిన వైఎస్ జగన్కు వేల కోట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. తండ్రి పేరు మీద, కాంగ్రెస్ పేరు మీద లూటీ చేస్తే వచ్చాయన్నారు. చంద్రబాబు రెండెకరాల రైతు అని, కాంగ్రెస్ వల్ల ఎమ్మెల్యే అయ్యాడని, ఇందిరాగాంధీ కాళ్లు పట్టుకుని మంత్రి అయ్యాడన్నారు. తర్వాత కాంగ్రెస్నూ, ఎన్టీఆర్నూ మోసం చేశాడని చింతామోహన్ అన్నారు.
ఏపీలో ఘనంగా అబేండ్కర్ జయంతి వేడుకలు
తిరుపతిలో ఓటుకు రేట్లు ఇవే
దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ వేల మంది ప్రాణాలు త్యాగమిచ్చిందని, ఈ దేశం కోసం ఇందిరాగాంధీ కూడా ప్రాణాలు ఇచ్చారని, జగన్ తండ్రి, తాతలెవరైనా ప్రాణాలు ఇచ్చారా అని చింతామోహన్ ప్రశ్నించారు. అలాగే మోడీ తాత, తండ్రులెవరైనా ప్రాణాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఓటుకు వెయ్యి, టీడీపీ ఓటుకు ఐదొందలు పంచుతున్నారని చింతా మోహన్ తెలిపారు. ఎన్నికల కమిషన్, పోలీసులు జగన్, చంద్రబాబు అక్రమాల్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు.
జగన్ జైలుకెళ్లేందుకు టీషర్ట్, బుక్స్ రెడీ చేసుకోవాలి
జగన్ ఇప్పటికే 99 తప్పులు చేశారని, వందో తప్పుగా ఓటుకు వెయ్యి పంచుతున్నారని చింతా మోహన్ ఆక్షేపించారు. జగన్ టీషర్టులు, పుస్తకాలు సర్దుకుని జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చింతా సూచించారు. తిరుపతి ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ 3 లక్షలు ఖర్చు చేస్తే జగన్ 30 కోట్లు, చంద్రబాబు 20 కోట్లు ఖర్చు చేశారని చింతా మోహన్ ఆరోపించారు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ? నీతిగా సంపాదించారా ? అవినీతి సొమ్మే కదా అని అన్నారు.
మూడు ప్రభుత్వాలు పడగొట్టా
1996లో పీవీ నరసింహారావు,1997లో దేవెగౌడ, 1999లో వాజ్పేయ్ ప్రభుత్వాల్ని పడగొట్టింది తానేనని చింతా మోహన్ మరో షాకింగ్ రహస్యాన్ని బయటపెట్టారు. మోడీ, షాలను ప్రజలే బేడీలు వేసి దేశం నుంచి తరుముతారని చింతా అన్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో తప్పులు చేశారన్నారు. వాజ్పేయ్ ఎంతో మేలన్నారు. అద్వానీ కూడా వెయ్యిరెట్లు మేలన్నారు. మోడీ, షా పెద్ద మనుషులు కాదని, చాలా పెద్ద పొరబాట్లు చేశారని చింతా మోహన్ ఆరోపించారు.
కాంగ్రెస్కు లక్ష ఓట్ల మెజారిటీ
కాంగ్రెస్ పార్టీ జాతి మెచ్చిన పార్టీ అని, తిరుపతిలో ఇద్దరు అవినీతి పరులు చంద్రబాబు, జగన్, ఓ నియంత మోడీకీ, కాంగ్రెస్ పార్టీకి మధ్య ధర్మయుద్ధం జరుగుతోందని, ఇందులో కాంగ్రెస్ పార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని చింతా మోహన్ అన్నారు. మోడీ, జగన్, చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. కాంగ్రెస్ గెలుపు ప్రజల గెలుపన్నారు. అది దేశానికి మలుపన్నారు. రేపటితో తిరుపతిలో ఉపఎన్నిక ప్రచారం ముగియనున్న నేపథ్యంలో చింతా మోహన్ కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.